
నోడల్ అధికారులూ.. అప్రమత్తం
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రధాని నరేంద్రమోదీ పర్యటన ముగిసే వరకు నోడల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. కలెక్టర్ లక్ష్మీశ గురువారం కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మండల, జిల్లాస్థాయి నోడల్ అధికారులు, ఆర్డీఓలు, ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు తదితరులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ అధికారులు ప్రణాళికలు అమలుచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. దీనికి సమన్వయంతో పని చేయాలని సూచించారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపనకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. వేసవి నేపథ్యంలో ఎక్కడికక్కడ మెడికల్ క్యాంపులు, తాగునీరు, మజ్జిగ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి బస్సులోనూ మెడికల్ కిట్లు, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు వంటివి అందుబాటులో ఉంటాయన్నారు. అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం సిద్ధం చేస్తారన్నారు. వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరే బస్సులు వేదిక వద్దకు సరైన సమయానికి చేరుకొని, తిరిగి విజయవంతంగా గమ్యస్థానాలకు చేరుకునే విషయంలో రూట్ అధికారులు, జిల్లాస్థాయి నోడల్ అధికారులు అయిన జిల్లా వ్యవసాయ అధికారి, డీఆర్డీఏ పీడీ, డ్వామా పీడీ, యూసీడీ పీవో నిరంతర పర్యవేక్షణతో అప్రమత్తంగా ప్రణాళికాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు. అంతకుముందు కలెక్టర్ లక్ష్మీశ వారధి, ప్రకాశం బ్యారేజీ, వెస్ట్ బైపాస్ తదితర ప్రాంతాల్లో ఏర్పాట్లను పరిశీలించారు.