
మాటలతో మత్తు జల్లుతాడు..
గుణదల(విజయవాడ తూర్పు): యువతులతో నమ్మకంగా నటిస్తూ నయవంచనకు పాల్పడుతున్న ఘరానా మోసగాడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన మాయమాటలతో నమ్మించి వారి వద్ద బంగారు ఆభరణాలను దొంగిలించే మాయలోడిని మాచవరం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ మేరకు సెంట్రల్ ఏసీపీ దామోదర్ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సులువైన దారిలో డబ్బు సంపాదించాలనే దురాశతో ఓ యువకుడు చోరీలకు అలవాటు పడ్డాడని తెలిపారు. హైదరాబాద్ నిజాంపేట, ప్రశాంతి నగర్కు చెందిన కిలారు నాగతేజ (23) అనే యువకుడు బీటెక్ పూర్తి చేశాడు. బాపట్లకు చెందిన ఈయన కుటుంబం బతుకుతెరువు నిమిత్తం హైదరాబాద్ వలస వెళ్లారు. వ్యసనాలకు అలవాటు పడిన నాగతేజ సులువుగా డబ్బు సంపాదించే మార్గాన్ని ఎన్నుకున్నాడు. దీనిలో భాగంగా ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్ల ద్వారా యువతులను టార్గెట్ చేశాడు. మాయమాటలతో ఆకట్టుకుని వారి వద్ద బంగారు నగలను దోచుకోవడం అలవాటుగా చేసుకున్నాడు. హైదరాబాదులో జరిగిన ఇటువంటి ఘటనల్లో పలుమార్లు ఈ యువకుడు అరెస్టయ్యాడు. ఇటీవల విడుదలైన నాగతేజ విజయవాడకు చెందిన ఓ యువతిని లోబరుచుకునే ప్రయత్నం చేశాడు. తాను ఓ పెద్ద వ్యాపారవేత్తనని నమ్మించి ఈ నెల 21వ తేదీన నగరంలోని ఓ హోటల్లో కలిసేందుకు పథకం రచించాడు. అక్కడకు వచ్చిన యువతికి మాయమాటలు చెప్పి బంగారాన్ని దోచుకునేందుకు సిద్ధమయ్యాడు. కత్తితో బెదిరించి యువతి వద్ద గల బంగారు చైను, ఉంగరాలను తీసుకుని ఆ యువతి చేతులు కట్టేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఎలాగో బయట పడ్డ ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు ప్రారంభించి శనివారం నిందితుడిని అరెస్టు చేశారు. రెండు లక్షల రూపాయల బంగారు సొత్తును స్వాధీనం చేసుకున్నారు. సీఐ సీహెచ్ ప్రకాష్, ఎస్.శంకరరావు పాల్గొన్నారు.
యువతులను మోసగించి బంగారు ఆభరణాలు అపహరిస్తున్న నిందితుడి అరెస్టు
రూ.2 లక్షల విలువైన సొత్తు స్వాధీనం