దళిత ద్రోహి చంద్రబాబు
మధురానగర్(విజయవాడసెంట్రల్): చంద్రబాబు దళిత ద్రోహి అని డెప్యూటీ సీఎం నారాయణస్వామి ధ్వజమెత్తారు. విజయవాడలో శనివారం నిర్వహించిన ఆసరా పథకం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ నిఖార్సయిన దళితులు ఎవరూ చంద్రబాబు దగ్గర ఉండరని తెలిపారు. అహర్నిశలు దళితులు, పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తున్న వ్యక్తి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్న చంద్రబాబు మాటలకు... నా ఎస్సీలు , నా బీసీలు, నా మైనార్టీలు అనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాటలకు ఎంత తేడా ఉందో మాజీ జడ్జి, అడ్వకేట్ శ్రవణ్ కుమార్ తెలుసుకోవాలని సూచించారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన రూ.2,500 కోట్ల ఐ.టి డిపార్ట్మెంట్ అవినీతిపై అప్పట్లో శ్రవణ్కుమార్ హైకోర్టులో కేసు ఫైల్ చేశారని గుర్తు చేశారు. అందులో అప్పటి సీఎం చంద్రబాబు, నారా లోకేష్, పల్లె రఘునాథ్రెడ్డిని నిందితులుగా చేర్చారన్నారు. కోర్టు సాక్ష్యాలు సమర్పించాలని కోరగా శ్రవణ్కుమార్ కేసు ఎందుకు వాపసు తీసుకున్నారని ప్రశ్నించారు. ఈ కేసు విషయంలో శ్రవణ్ ఎంతకి లాలూచీ పడ్డాడో చెప్పాలని నిలదీశారు. ఇప్పుడు ఇదే శ్రవణ్కుమార్ వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో టీడీపీ వ్యక్తులు వేసే కేసులు వాదిస్తున్నారన్నారు. ఇది దళితులందరు గమనించాలని కోరారు.
డెప్యూటీ సీఎం నారాయణస్వామి