
ఏపీ ఈఏపీసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు ప్రారంభం
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఏపీ ఈఏపీసెట్ పరీక్షల్లో భాగంగా ఇంజినీరింగ్ స్ట్రీమింగ్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు సంబంధించిన ప్రవేశ పరీక్ష నిర్వహించారు. బుధవారం నుంచి ఇంజినీరింగ్ విభాగం ప్రవేశ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం, సాయంత్రం రెండు విడతలుగా పరీక్షలు జరిగాయి. జిల్లాలో 12 కేంద్రాల్లో 7,816 మంది విద్యార్థు లకు 7,328 మంది పరీక్షలు రాశారు. కృష్ణాజిల్లాకు మూడు కేంద్రాల్లో 1,009 మంది విద్యార్థులకు 973 మంది హాజరయ్యారు.
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
కోనేరుసెంటర్(మచిలీపట్నం): యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె.రాంజీ పేర్కొన్నారు. విశ్వవిద్యాలయంలో బుధవారం యోగా డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు అధ్యాపకులు, విద్యార్థులతో యోగా గురువులు ఆసనాలు వేయించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో వీసీ రాంజీ మాట్లాడుతూ.. యోగాతో ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ యోగా సాధన చేసి ఆరోగ్యవంతు లుగా జీవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య ఎన్.ఉష, ఇతర అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
జాతీయ రెజ్లింగ్ పోటీలకు నిహారిక, కుమార్
విజయవాడస్పోర్ట్స్: అండర్ –17 జాతీయ రెజ్లింగ్ పోటీలకు ప్రాతినిధ్యం వహించే ఆంధ్ర ప్రదేశ్ జట్టులో విజయవాడ క్రీడాకారులు బి. నిహారిక, బి.కుమార్ చోటు దక్కించుకున్నారని ఎన్టీఆర్ జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ఇన్చార్జి కార్యదర్శి డి.శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. ఇటీవల చిత్తూరులో జరిగిన రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీల్లో ఈ ఇద్దరు క్రీడాకారులు సత్తాచాటి పతకాలు సాధించారని పేర్కొన్నారు. ఈ నెల 25 నుంచి 27 వరకు హరియాణా రాష్ట్రంలోని పల్వాల్లో జరిగే జాతీయ పోటీల్లో నిహారిక 36–40 కిలోల విభాగం, కుమార్ 41–45 కిలోల విభాగంలో ప్రాతినిధ్యం వహిస్తారని వివరించారు.
‘ఉపాధి’లో ఉచితంగా పండ్ల తోటల పెంపకం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రైతులు ఉచితంగా పండ్ల తోటల సాగు చేపట్టొచ్చని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంపై రైతులకు అవగాహన కల్పించి, సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలని ఆదేశిం చారు. కలెక్టరేట్లో కలెక్టర్ లక్ష్మీశ ఉపాధి హామీ పథకంలో పండ్ల తోటలు, పశుగ్రాసం పెంపకా నికి సంబంధించిన సమాచారంతో కూడిన కరపత్రాలను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. ఉద్యాన పంటల ద్వారా రైతులకు మెరుగైన ఆదాయం లభిస్తుందన్నారు. ఉపాధి పథకం ద్వారా ఉచితంగా ఉద్యాన పంటల సాగు చేపట్టొచ్చని పేర్కొన్నారు. మామిడి, జామ, నిమ్మ, సపోట, దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్, కొబ్బరి, ఆయిల్పామ్, ఆపిల్ బేర్, మునగ, మల్లి, గులాబీ వంటి తోటల పెంపకానికి ఐదెకరాల లోపు పొలం ఉన్న చిన్న, సన్నకారు రైతులు అర్హులని తెలిపారు. సొంత భూమి ఉండి పశుపోషణ చేస్తున్న రైతులు పశుగ్రాసం పెంపకం చేపట్టవచ్చన్నారు. ఆసక్తిగల రైతులు ఎంపీడీఓ లేదా ఉపాధి హామీ ఏపీఓ లేదా గ్రామ సచివా లయ ఉద్యాన అసిస్టెంట్, అగ్రికల్చర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్లను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో డ్వామా పీడీ ఎ.రాము, గ్రామ/వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, జిల్లా ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్, ఏడీఏ అనిత, డ్వామా జిల్లా ప్లాంటేషన్ మేనేజర్ కె.ఉష తదితరులు పాల్గొన్నారు.

ఏపీ ఈఏపీసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు ప్రారంభం

ఏపీ ఈఏపీసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు ప్రారంభం