
డీఈఓ సి.వి. రేణుక
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలోని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలలో పేద విద్యార్థులకు 25 శాతం ఉచిత ప్రవేశాలను కల్పించాలని జిల్లా విద్యా శాఖాధికారి సి.వి. రేణుక స్పష్టం చేశారు. ఉచిత నిర్భంద విద్యా హక్కు చట్టాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి కచ్చితంగా అమలు చేసేలా ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలను ఆదేశించినట్లు పేర్కొన్నారు. ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలలో ఉచిత నిర్భంద విద్యా హక్కు చట్టం అమలు పై శుక్రవారం జిల్లా విద్యాశాఖాధికారి సి.వి.రేణుక ఆమె కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉచిత నిర్భంద విద్యా హక్కు చట్టం 12(1) (సి) ప్రకారం 2023–24 విద్యా సంవత్సరం నుంచి జిల్లాలో ఐబీ, ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ, స్టేట్ సిలబస్లను అమలు చేస్తున్న అన్ని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలలో ఒకటో తరగతి నందు పేద విద్యార్థులకు 25 శాతం ఉచిత ప్రవేశాలను కల్పించాలన్న ఆదేశాలను ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యలు కచ్చితంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. 25 శాతం సీట్లలో అనాథ బాలలు, దివ్యాంగులు, హెచ్ఐవీ బాధిత కుటుంబాలకు చెందిన పిల్లలకు 5 శాతం ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం ఓసీ, బీసీ, మైనార్టీ వర్గాలలో నిరుపేదలకు 6 శాతం కేటాయించారన్నారు. జిల్లాలోని ఉప విద్యా శాఖాధికారులు, మండల విద్యా శాఖాధికారులు, సంబంధిత ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలను, విలేజ్ వార్డు సచివాలయ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు సహాయం చేయాలన్నారు. విద్యా సంవత్సరంలో 1వ తరగతిలో అర్హులైన ప్రతి ఒక్కరికి అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేసేలా ఆదేశించారు. అర్హులైన విద్యార్థులు ప్రవేశాల కొరకు ఏప్రిల్ 10వ తేదీ లోపు http://cse.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు.