
బుజ్జమ్మా.. ఆరోగ్యం ఎట్లుంది
ఆర్మూర్ : ‘బుజ్జమ్మా ఆరోగ్యం ఎలా ఉంది? డాక్ట ర్లు, సిబ్బంది సరిగ్గా పట్టించుకుంటున్నారా? అవసరమైతే హైదరాబాద్కు పంపిస్తా?’ అని ఆర్మూర్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధురాలిని కలెక్టర్ టీ వినయ్కృష్ణారెడ్డి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను వి వరాలు అడిగి తెలుసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. పెర్కిట్కు చెందిన బుజ్జమ్మ అనారోగ్యంతో బాధపడుతుండడంతో అంబులెన్స్ సిబ్బంది మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రి సిబ్బంది గాయమైన కాలికి పట్టీ కట్టి బయటకు పంపించారు. దీంతో బుజ్జమ్మ ఆస్పత్రి బయట రేకుల షెడ్డులో దయనీయ పరిస్థితుల్లో పడుకొని ఉంది. ఆస్పత్రి వర్గాలు సరిగా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి బయటకు పంపించారని గమనించిన సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా నాయకుడు ప్రభాకర్ ఫోన్ ద్వారా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన కలెక్టర్ బుజ్జమ్మకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జీజీహెచ్ అధికారులను ఆదేశించారు. అయితే, తమ స్వస్థలమైన పెర్కిట్కు చేరువలో ఉన్న ఆర్మూర్ ఆస్పత్రిలో చికిత్స చేయించాలని బుజ్జమ్మ దూరపు బంధువులు కోరడంతో ఆమెను ఆర్మూర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కలెక్టర్ బుధవారం ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించి బుజ్జమ్మను పరామర్శించారు. ఆమె కాలికి గాయం తీవ్రంగా ఉందని, మెరుగైన వైద్య సేవలు అవసరమని డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీంతో బుజ్జమ్మను తిరిగి జీజీహెచ్కు షిఫ్ట్ చేయాలని, పూర్తిగా కోలుకునే వరకు మెరుగైన చికిత్స అందించాలని, అవసరమైతే హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బుజ్జమ్మను వెంటనే జీజీహెచ్కు తరలించారు.
వృద్ధురాలిని పరామర్శించిన
కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
మెరుగైన వైద్యం అందించాలని
వైద్యులకు ఆదేశం

బుజ్జమ్మా.. ఆరోగ్యం ఎట్లుంది