
జూలై 16న తెయూ రెండో కాన్వొకేషన్
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ విశ్వవిద్యాలయంలో రెండో కాన్వొకేషన్ను జూలై 16న ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నామని వైస్–చాన్స్లర్ ప్రొఫెసర్ టీ యాదగిరిరావు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) మాజీ డైరెక్టర్ డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ హాజరుకానున్నారు. వర్సిటీ కంట్రోలర్, డీన్స్, ప్రిన్సిపాల్స్, డైరెక్టర్స్, అధ్యాపకులతో బుధవారం వీసీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కాన్వొకేషన్ విజయవంతం చేయడానికి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం యాదగిరి కన్వీనర్గా 13 కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. కమిటీల కన్వీనర్లు క్రమశిక్షణతో కాన్వొకేషన్ పనులను పూర్తిచేసి విజయవంతం చేయాలని సూచించారు. వర్సిటీ ప్రారంభమైన తర్వాత 13 నవంబర్ 2013న మొదటి కాన్వొకేషన్ నిర్వహించారని, రెండో కాన్వొకేషన్ కోసం అప్పటి వీసీ ప్రొఫెసర్ పీ సాంబయ్య హయాంలో 6 జూలై 2018న, మళ్లీ గత వీసీ ప్రొఫెసర్ రవీందర్ గుప్తా హయాంలో 12 మార్చి 2020న నోటిఫికేషన్లు ఇచ్చినప్పటికీ పలు కారణాలతో వాయిదా పడినట్లు వీసీ తెలిపారు. ప్రస్తుతం వీసీగా తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత 14 నవంబర్ 2024న కాన్వొకేషన్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ప్రొఫెసర్ యాదగిరిరావు తెలిపారు. పీజీ, యూజీలో వివిధ విభాగాల నుంచి మొదటి ర్యాంకు సాధించిన 130 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్తోపాటు సుమారు 70 మంది స్కాలర్స్కు పీహెచ్డీ డాక్టరేట్ పట్టాలను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా అందించనున్నట్లు వీసీ తెలిపారు.
ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఐఐసీటీ మాజీ డైరెక్టర్ డాక్టర్ చంద్రశేఖర్
వీసీ ప్రొఫెసర్ యాదగిరిరావు వెల్లడి