రుద్రూర్: మండలంలోని అక్బర్నగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. ఆదివారం సాయంత్రం రుద్రూర్ వైపు వెళుతున్న ఆటోను వెనుక నుంచి వేగంగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఓ చిన్నారితోపాటు ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బోధన్ ఆస్పత్రికి తరలించారు.
దాడి చేసిన వారిపై కేసు నమోదు
రుద్రూర్: పోతంగల్ మండలం జల్లాపల్లిపారంలో డబ్బుల విషయమై ఘర్షణ పడి దాడి చేసిన ఐదుగురిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై సునీల్ తెలిపారు. వివరాలు ఇలా.. జల్లాపల్లిపారంకు చెందిన శ్రీకాంత్, బీర్కూర్ తండాకు చెందిన సుధాకర్కు డబ్బుల విషయంలో గొడవ జరిగింది. గ్రామ పెద్దల సమక్షంలో డబ్బుల సమస్య గూర్చి శనివారం మాట్లాడుతుండగా బీర్కూర్కు చెందిన ముగ్గురు, జల్లాపల్లిపారంకు చెందిన ఇద్దరు గొడవ పడి శ్రీకాంత్, ఆయన తండ్రి ఓంకార్పై దాడి చేశారు. దీంతో బాఽధితులు ఆదివారం వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
ఈదురు గాలులకు కూలిన చెట్లు
వేల్పూర్: మండలంలోని పడగల్ గ్రామంలో ప్రధాన రహదారిపై ఆదివారం మధ్యాహ్నం రెండు భారీ వృక్షాలు నేలకూలాయి. వర్షంతోపాటు బలమైన గాలుల కారణంగా గ్రామంలోని బీసీ హాస్టల్ ఆవరణలో ఉన్న చెట్టు నేలకూలి, రోడ్డుపై ఉన్న మరో చెట్టుపై వాలింది. అనంతరం రెండు చెట్లు రోడ్డుపై కూలిపోయాయి. ఆ సమయంలో రహదారిపై ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. చెట్లు రహదారిపై కూలిపోవడంతో వన్నెల్ బి వైపు రాకపోకలు చాలాసేపు నిలిచిపోయాయి. గ్రామస్తులు చెట్లను తొలగించడంతో తిరిగి రాకపోకలు ప్రారంభమయ్యాయి.
పేకాడుతున్న తొమ్మిది మంది అరెస్టు
నిజాంసాగర్(జుక్కల్): నిజాంసాగర్ ప్రాజెక్టు సమీపంలో ఆదివారం పేకాట ఆడుతున్న 9మందిని అరెస్టు చేసినట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు పేకాట స్థావరంపై దాడి చేయగా పేకాడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. అలాగే వారి వద్ద నుంచి రూ.40వేల నగదు, 7 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.
వృద్ధురాలి అదృశ్యం
బాన్సువాడ రూరల్: బీర్కూర్ మండలం మిర్జాపూర్కు చెందిన అంజవ్వ అనే వృద్ధురాలు అదృశ్యమైనట్లు బాన్సువాడ పోలీసులు తెలిపారు. మిర్జాపూర్కు చెందిన అంజవ్వ ఏడాది కాలంగా బోర్లంలో నివాసం ఉంటుంది. అంజవ్వ ఈనెల 16న ఎప్పటిలాగే పింఛన్ డబ్బులు, రేషన్ బియ్యం కోసం మిర్జాపూర్ వెళ్లింది. కానీ ఇప్పటికి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆమె ఆచూకీ కోసం కుటుంబసభ్యులు వాట్సాప్గ్రూపులో పోస్టు చేయగా దోమకొండ బస్టాండ్లో కన్పించినట్లు తెలిసింది. కానీ అక్కడికి వెళ్ళే సరికి అమె కామారెడ్డి బస్సు ఎక్కి వెళ్ళిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఆమె ఆచూకీ లభించకపోవడంతో ఆమె అల్లుడు బోర్లం గ్రామానికి చెందిన కాదిరెడ్డి విజయ్కుమార్ బాన్సువాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఆరెంజ్ కలర్ చీర, పసుపురంగు జాకెట్టు ధరించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె ఎవరికై నా కనిపిస్తే సెల్నెంబర్ 9989354036కు సమాచారం అందించాలన్నారు.
గుండారంలో ఒకరు..
నిజామాబాద్రూరల్: గుండారం గ్రామ శివారులో ఉన్న క్లాసిక్ పేపర్మిల్లో పనిచేస్తున్న రాకేష్కుమార్ అనే వ్యక్తి అదృశ్యమైనట్లు రూరల్ ఎస్హెచ్వో మహ్మద్ ఆరీఫ్ ఆదివారం తెలిపారు. బీహార్ రాష్ట్రానికి చెందిన రాకేష్కుమార్ తన తమ్ముడు చోటన్కుమార్తో కలిసి ఈనెల 4న పేపర్మిల్కు ఉపాధి నిమిత్తం వచ్చాడు. కొన్ని రోజులుగా రాకేష్ కనబడకపోవడంతో బీహార్లో ఉన్న కుటుంబసభ్యులకు ఫోన్లో సంప్రదించారు. వారు ఇక్కడకు రాలేదని తెలపడంతో అతడి తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు