
మా వాళ్లు పదిలమేనా?
● ఉపాధి, విద్య అవకాశాల కోసం
ఇజ్రాయిల్లో స్థిరపడిన
పలువురు జిల్లావాసులు
● ఇరాన్–ఇజ్రాయిల్ దాడుల
నేపథ్యంలో జిల్లాలోని వారి
కుటుంబాల్లో ఆందోళన
ఆర్మూర్: ఇరాన్–ఇజ్రాయిల్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతోపాటు, నిత్యం దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయిల్లో స్థిరపడిన జిల్లావాసుల గురించి ఇక్కడి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఉపాధి, విద్య అవకాశాల కోసం తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంతోమంది ఇజ్రాయిల్ దేశం తరలివెళ్లారు. వారిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లానుంచి వెళ్లిన వారు పదుల సంఖ్యలో ఉంటారు. ఇజ్రాయిల్ సైన్యం శత్రు దేశాల దాడులను ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నా.. స్థానికంగా వలసవాదుల కుటుంబీకులు ఆందోళన చెందుతూ తమ వారికి ఫోన్లు చేస్తూ ఎప్పటికప్పుడు క్షేమ సమాచారం తెలుసుకుంటున్నారు.
నిజామాబాద్, కరీంనగర్, నిర్మల్, మెదక్, జగిత్యాల జిల్లాలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా సుమారు 800 మంది ఇజ్రాయిల్లో ఉపాధి కల్పించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం టామ్కామ్ ద్వారా వందల సంఖ్యలో కార్మికులకు ఇజ్రాయిల్లో ఉపాధి అవకాశాలు కల్పించింది. మరో వైపు ఈ దేశంలో తెలుగు వారు సుమారుగా ఐదు వేల మంది వివిధ వ్యాపారాలు, ఉద్యోగాలు, ఉన్నత చదువుల కోసం నివాసం ఉంటునట్లు సమాచారం. ప్రస్తుతం బాంబు దాడుల నేపథ్యంలో ఇజ్రాయిలీలతో పాటు వలస కార్మికులు భూగర్భ బంకర్లలో లేదా సమీపంలోని అండర్ గ్రౌండ్ మెట్రోల్లో రాత్రిళ్లు తలదాచుకుంటున్నారని తెలిపారు. ఈక్రమంలో ఇజ్రాయిల్, ఇరాన్ దేశాల్లో ఉన్న తమ వారిని రక్షించే బాధ్యత భారత ప్రభుత్వం తీసుకోవాలని వారి కుటుంబ సభ్యులు విన్నవించుకుంటున్నారు.
భయంభయంగా ఉంది..
నా భర్త కుటుంబ పోషణ కోసం ఇజ్రాయిల్ దేశానికి ఉపాధి నిమిత్తం వెళ్లాడు. కానీ ఏడాదిన్నరగా అక్కడ జరుగుతున్న యుద్ధంతో ఇక్కడ మేము ప్రతీరోజు మేము చస్తూబ్రతుకుతున్నాము. ప్రతీరోజు ఫోన్లో ఆయన క్షేమ సమాచారాలు ఇచ్చినప్పటికీ మాలో భయం పోవడం లేదు.
– రమ, ఆర్మూర్ పట్టణం
ఇంటికి రావడం లేదు..
ఇక్కడ పని దొరకక రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో టామ్ కమ్ ద్వారా మా నాన్న ఇజ్రాయిల్కు వెళ్లాడు. మేము చేసిన అప్పులే ఇంకా తీరలేవు. కానీ అక్కడి యుద్ధం మా పాలిట కష్టాలను తెచ్చి పెట్టింది. మా నాన్నను ఇంటికి వచ్చేయమని అంటున్నాము. కానీ ఇక్కడి ఆర్థిక పరిస్థితుల కారణంగా నాన్న రావడానికి ఇష్టపడటంలేదు. – రాజు, నిజామాబాద్