జిల్లా ఇన్చార్జి మంత్రిగా సీతక్క
నిజామాబాద్అర్బన్ : జిల్లా ఇన్చార్జి మంత్రి గా రాష్ట్ర పంచాయతీరాజ్, సీ్త్ర శిశు సంక్షేమ, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకుముందు ఇన్చార్జి మంత్రిగా పనిచేసిన జూపల్లి కష్ణారావు అదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియామకమయ్యారు. ఆదిలాబాద్ ఇన్చార్జి మంత్రిగా కొనసాగిన సీతక్క ఇక్కడికి వస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు జిల్లాకు మంత్రి పదవి దక్కకపోగా, ఇన్చార్జి మంత్రిగా సీతక్క రావడంపై రాజకీయ వర్గాల్లో చర్చజరుగుతోంది.
ఆర్టీసీ కాలనీలో
పిడుగుపాటు
మాక్లూర్: మండలంలోని మానిక్భండార్ శి వారు ఆర్టీసీ కాలనీలో గురువారం ఉద యం చిట్యాల జనార్దన్ ఇంటిపై పిడుగుపడింది. ఇంటి పైకప్పు స్వల్పంగా ధ్వంసమైంది. ఇంట్లోని ఫ్యాన్లు, ఫ్రిజ్, టీవీ కూడా పనిచేయటం లేదని జనార్దన్ తెలిపారు.
స్కూల్ బస్సుల తనిఖీ
ఖలీల్వాడి : నగరంలోని వినాయక్ నగర్లో రవాణా శాఖ అధికారులు స్కూల్ బస్సుల తనిఖీలు నిర్వహించారు. డిప్యూటీ రవాణా శాఖ కమిషనర్ దుర్గా ప్రమీల ఆధ్వర్యంలో ప్రైవేట్ స్కూల్ బస్సులను ఆపి, బస్సులో లోపలి భాగంలో నిబంధనల మేరకు అన్నీ సక్రమంగా ఉన్నాయో? లేదో? పరిశీలించారు. ఫిట్నెస్ పత్రాలు లేని ఓ స్కూల్ బస్సుపై కేసు నమోదు చేశారు. నిబంధనల మేరకు లేని బస్సులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తనిఖీల్లో ఇన్చార్జి డీటీవో రాహుల్, ఎంవీఐ కిరణ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్సారెస్పీలోకి 2,080 క్యూసెక్కుల వరద
బాల్కొండ: స్థానిక ఎగువ ప్రాంతాల్లో కురిసి న వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి 2,080 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్ట్ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా 100, మిషన్ భగీరథ ద్వారా 231, ఆవిరి రూపంలో 321 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 (80.5 టీఎంసీలు) అడుగులు కాగా గురువా రం సాయంత్రానికి ప్రాజెక్ట్లో 1062.8 (13.36 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు.
నిజాంసాగర్లోకి స్వల్ప ఇన్ఫ్లో
నిజాంసాగర్(జుక్కల్): ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 590 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1393.5 అడుగుల (5.9 టీఎంసీలు) నీరు నిల్వ ఉందన్నారు.
సాయుధ దళాల నిధికి రూ.లక్ష విరాళం
సుభాష్నగర్: దేశ రక్షణ కోసం తమ జీవితాలను త్యాగం చేస్తున్న భారత త్రివిధ దళాల సేవలు మరువలేనివని, వారి సంక్షేమానికి పౌరునిగా చేయూతనందిస్తూ సాయుధ దళాల పతాక నిధికి విద్యుత్ శాఖ రిటైర్డ్ ఉద్యోగి, కామారెడ్డికి చెందిన కే కృష్ణమూర్తి రూ.లక్ష విరాళం ప్రకటించారు. ఈ మేరకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి డీ రమేశ్కు ఆయన గురువారం చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి శర్మ దంపతులను శాలువాతో సత్కరించి అభినందించారు. అనంతరం అధికారి రమేశ్ మాట్లాడుతూ కృష్ణమూర్తి శర్మను స్ఫూర్తిగా తీసుకొని ఉమ్మడి జిల్లాలోని వ్యాపారులు, ప్రజలు దేశ రక్షణలో విధులు నిర్వహిస్తున్న సైనికులు, వారి కుటుంబాలకు స్వచ్ఛందంగా విరాళాలు అందించి చేయూతనందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయ సిబ్బంది బదాం గంగామోహన్, ఉమేర్ తదితరులు పాల్గొన్నారు.


