తగ్గుతున్న ప్రవేశాలు | - | Sakshi
Sakshi News home page

తగ్గుతున్న ప్రవేశాలు

Jun 12 2025 3:37 AM | Updated on Jun 12 2025 3:37 AM

తగ్గుతున్న ప్రవేశాలు

తగ్గుతున్న ప్రవేశాలు

సర్కారు బడుల్లో

నిజామాబాద్‌అర్బన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి ఏటా విద్యార్థుల ప్రవేశాలు తగ్గిపోతున్నాయి. ప్రతి ఏడాది బడిబాట కార్యక్రమం నిర్వహించినా ప్రవేశాలు మాత్రం నామమాత్రంగానే కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా విచ్చలవిడిగా ప్రైవేట్‌ పాఠశాలలు నెలకొల్పడం వల్ల ప్రభుత్వ పాఠశాలలకు ఇబ్బందికరంగా మారింది. వీటితో పాటు గురుకుల పాఠశాలలు కూడా మెరుగైన స్థితిలో ఉండడంతో ఇక్కడ ప్రవేశాలు పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతు వస్తోంది.

38 పాఠశాలలు మూత

గత నాలుగేళ్లుగా విద్యార్థుల ప్రవేశాల సంఖ్య తగ్గుతుండడంతో 38 ప్రాథమిక పాఠశాలలు విద్యార్థులు లేక మూతపడ్డాయి. ప్రస్తుతం ఈ మూతపడిన పాఠశాలల ప్రాంతంలో బడిబాట కార్యక్రమం నిర్వహించి మళ్లీ వాటిని కొనసాగించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఒక బడికి కిలోమీటర్‌ లోపు మరో పాఠశాల ఉండి విద్యార్థుల సంఖ్య అతితక్కువగా ఉంటే సమీప పాఠశాలకు బదలాయింపు చేస్తున్నారు. ఒక కిలోమీటర్‌కు మించి దూరంలో ఉంటే అదే ప్రాంతంలో కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నారు.

28 పాఠశాలల్లోనే బడిబాట..

ప్రతి ఏటా పాఠశాలల పున:ప్రారంభ సమయంలో విద్యాశాఖ బడిబాట కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ ఏడాది ఈనెల 6 నుంచి బడిబాట కార్యక్రమం ప్రారంభించగా 11వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా కేవలం 28 పాఠశాలలు మాత్రమే ఈ కార్యక్రమం నిర్వహించాయి. ఇందులో 280 మంది విద్యార్థులను నూతనంగా చేర్పించారు. మిగిత పాఠశాలలు ఈ కార్యక్రమంపై నిర్లక్ష్యం చేశాయి. ఈనెల 19 వరకు బడిబాట కార్యక్రమం కొనసాగనుండగా ప్రధానంగా దృష్టిసారిస్తామని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో 2021–22 విద్యాసంవత్సరం, 2022–23 విద్యాసంవత్సరంలో లోకల్‌ బాడీ పాఠశాలలకు సంబంధించి 157 మంది విద్యార్థులు తగ్గిపోయారు. 2023–24, 2024–25 విద్యాసంవత్సరంలో మధ్య కాలంలో 261 మంది విద్యార్థులు తగ్గిపోయారు. రాష్ట్ర పరిధిలోని ఐదు ప్రాథమిక పాఠశాలలు ఉండగా 2021–22 , 2022–23 విద్యాసంవత్సరంలో 71మంది విద్యార్థులు తగ్గిపోయారు. 2023–24,2024–25 విద్యాసంవత్సరంలో 21 మంది విద్యార్థులు తగ్గిపోయారు.

‘ప్రయివేటు’ జోరు..

జిల్లా వ్యాప్తంగా 477 ప్రయివేట్‌ పాఠశాలలు ఉండగా ఇందులో ప్రతి ఏటా ప్రవేశాలు పెరుగుతూ వస్తున్నాయి. 2021–22 విద్యాసంవత్సరంలో 1,19,271 మంది విద్యార్థులు ఉన్నారు. 2022–23లో 1,35,549 మంది విద్యార్థులు. 2023–24లో 1,53,016 మంది విద్యార్థులు. 2024–25లో 1,66,424 మంది విద్యార్థులు నమోదయ్యారు. మరోవైపు పాఠశాలల్లో ఎల్‌కేజీ స్థాయిలోనే రూ.వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రత్యేక విద్యాబోధన పేరిట అదనపు ఫీజులు వసూలు చేస్తున్నారు. వీటితోపాటు పుస్తకాలు, వివిధ వస్తువుల విక్రయాలు చేపడుతున్నారు. అయినా తల్లిదండ్రులు విద్యార్థుల భవిష్యత్‌ కోసం ప్రయివేట్‌ బడులనే ఆశ్రయిస్తున్నారు.

ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్ల వివరాలు

మేనేజ్‌మెంట్‌ స్కూళ్లు 2021–22 2022–23 2023–24 2024–25

ప్రభుత్వ పాఠశాలలు 112 14,914 14,757 14,106 13,845

ప్రభుత్వ పాఠశాల (రాష్ట్ర పరిధి) 5 211 140 119 98

ఎంపీపీ, జెడ్పీ పాఠశాలలు 1039 99,152 86,391 75,539 70,119

నామమాత్రంగానే

కొనసాగుతున్న బడిబాట

నేడు పాఠశాలల పున:ప్రారంభం

మెరుగైన విద్యాబోధన అందిస్తాం..

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యాబోధన అందిస్తాం. ప్రతి పాఠశాలపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నాం. బడుల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. టీచర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాం. –అశోక్‌, డీఈవో,

నిజామాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement