
రెచ్చిపోతున్న కలప స్మగర్లు
● జిల్లాలో యథేచ్ఛగా అడవుల నరికివేత
● సిరికొండ, నిజామాబాద్ నార్త్
రేంజ్లలోనే ఎక్కువ
● గడిచిన ఐదు నెలల్లో
300 దుంగల పట్టివేత
● కేసులు నమోదు చేస్తున్నా
జంకని టేకు దొంగలు
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో కలప దొంగలు రెచ్చిపోతున్నారు. అధికారుల కళ్లుగప్పి అడవులను కొల్లగొడుతున్నారు. టేకు చెట్లను యథేచ్ఛగా నరికి దుంగలను తీసుకెళ్తున్నారు. ఎవరికీ దొరకుండా దుంగలను రహస్యంగా వ్యవసాయ బావుల్లో, గడ్డి వాముల్లో, పొదల్లో, పాడు బడిన ఇళ్లలో దాచి పెడుతున్నారు. నిజామాబాద్ సౌత్, సిరికొండ రేంజ్ల పరిధిలో కలప పట్టివేత కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. గడిచిన ఐదారు నెలల్లో ఆరుకు పైగా సంఘటనలు జరిగాయి. ఈ ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో టేకు దుంగలు బయట పడుతుండడం అక్కడి అటవీ అధికారులు ఏ విధంగా అడవులను సంరక్షిస్తున్నారో తెలుస్తోంది. జిల్లా అటవీ విస్తీర్ణం 86,871.45 హెక్టార్లలో ఉండగా, టేకు దొరికే అడవులు మాత్రం మోపాల్, సిరికొండ, భీమ్గల్, కమ్మర్పల్లి, వర్ని మండలాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. మార్కెట్లో టేకుకు ఎక్కువ డిమాండ్ ఉండడంతో స్మగ్లింగ్ పెరిగిపోయింది. టేకు ఎక్కవగా లభించే ఐదు మండలాల్లో అడవులన్నీ తండాలకు సమీపంలో ఉండటంతో నడి రాత్రుల్లో, తెల్లవారు సమయాల్లోనే టేకు చెట్లను ఎక్కువగా నరికివేస్తున్నారు. అధికారులు పసిగట్టేలోపే స్మగ్లరు అక్కడి నుంచి మాయమవుతున్నారు. కలప ఎవరికీ దొరకకుండా రహస్య ప్రాంతాలకు తరలించి దాచి పెడుతున్నారు. వీటిని కొంతమంది సొంతానికి వాడుకుంటుండగా, మరి కొందరు టింబర్ డిపోలు, కార్పెంటర్లకు విక్రయించి వ్యాపారం చేస్తున్నారు. మోపాల్, సిరికొండ, భీమ్గల్, కమ్మర్పల్లి, వర్ని మండలాల పరిధిలో ‘జీరో’ మాల్ దందా బహిరంగగా సాగేందుకు కొందరు అటవీ అధికారుల సహకారం ఉందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వాయిదాల ప్రకారం ముడుపులు తీసుకుని చూసీచూడనట్లు ఉంటున్నారనే విమర్శలు సైతం ఉన్నాయి.
జిల్లాలో రేంజ్ల వారీగా అడవుల విస్తీర్ణం(హెక్టార్లలో)
ఈ నెల 3వ తేదీన సిరికొండ మండలం పాకాల అటవీ సమీపంలోని మూడు ఇళ్లతోపాటు పొలాలు, గడ్డి వాముల్లో 131 టేకు దుంగలు లభించాయి. అటవీ అధికారులు పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి ముగ్గురిపై కేసు నమోదు చేశారు. పట్టుబడిన కలప విలువ రూ.2లక్షల పైనే ఉంటుంది. ఇదే మండల పరిధిలో చీమన్పల్లిలో ఐదు నెలల క్రితం 86 టేకు దుంగలు పాడుబడిన ఇళ్లలో, పొదల్లో లభించాయి. వీటి విలువ సుమారు రూ.లక్షా50వేలు ఉంటుంది.
ఈ ఏడాది మార్చి నెలలో మోపాల్ మండలం ఎల్లమ్మ కుంటలో 60 టేకు దుంగలను అటవీ అధికారులు పట్టుకున్నారు. ఇవి దొరికిన విధానం సేమ్ ‘పుష్ప’ సినిమాను తలపించింది. ఊరి బయట వ్యవసాయ బావిలో ఒక దుంగ తేలి ఉండడంతో అందులో వెతికారు. ఏకంగా 60 కలప దుంగలు దొరికాయి. అయితే దుంగలను దాచిపెట్టిన వ్యక్తులెవరో అధికారులు గుర్తించలేకపోయారు. ఇదే మోపాల్ మండలం సిర్పూర్లో అడవిలో టేకు స్మగ్లింగ్ జరుగుతోందనే సమాచారంతో అటవీ అధికారులు అక్కడికి వెళ్లగా స్మగ్లర్లు పారిపోయారు. అక్కడ 17 కలప దుంగలను సీజ్ చేశారు.

రెచ్చిపోతున్న కలప స్మగర్లు