
‘నర్సయ్య స్ఫూర్తితో ఉద్యమాలు’
మోపాల్: రైతాంగ పోరాటయోధుడు, అఖిలభారత రైతు కూలీ సంఘం గౌరవాధ్యక్షుడు నాయక్వాడి నర్సయ్య పోరాట స్ఫూర్తితో రైతాంగ ఉద్యమాలను నిర్మిద్దామని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య పేర్కొన్నారు. మంగళశారం ఏఐకేఎంఎస్ మోపాల్ మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నర్సయ్య సంతాప సభను నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళ్లర్పించారు. అనంతరం వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ.. నిజాంసాగర్ ఆయకట్టు రక్షణ కోసం జరిగిన రైతు ఉద్యమం, ఎన్సీఎస్ఎఫ్ సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీని తెరిపించాలని జరిగిన ఉద్యమంలో నాయక్వాడి నర్సయ్య కీలకంగా వ్యవహరించారని తెలిపారు. నర్సయ్య మరణం రైతు, ప్రజా ఉద్యమాలకు తీరని లోటు అని పేర్కొన్నారు. ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు అగ్గు ఎర్రన్న, నాయకులు బండమీది నర్సయ్య, బి గంగారాం, అగ్గు చిన్నయ్య, వేల్పూర్ రమేష్, తదితరులున్నారు.