
ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం
వేల్పూర్: ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో ఆదివారం ఓ కార్యక్రమానికి హాజరై వెళ్తుండగా రహదారిపై మొలకెత్తిన ధాన్యాన్ని, తూకం వేయకుండా ఉన్న ధాన్యపు రాశులను ఆయన బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులకు ఇంకా కష్టాలు తప్పడం లేదన్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై 3 నెలలవుతున్నా రోడ్లపై ధాన్యపు రాశులు ఉన్నాయన్నారు. సకాలంలో ధాన్యం కొనుగోలు జరుగక అకాల వర్షాలకు తడిసి మొలకలు వచ్చిన ధాన్యాన్ని కిలోకు రూ. 4 లేదా రూ. 5 కు అమ్ముకోవాల్సి వస్తోందన్నారు. దీనికి కారణం సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనమేనని ఆరోపించారు. సీఎంకు అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని విమర్శించారు. అక్కడే ఉన్న ఓ రైతు ఈ రోజే కొనుగోలుకు చివరి రోజని, రేపటి నుంచి కొనుగోలు చేయమని అంటున్నారని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. దీంతో అక్కడి నుంచే కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతుతో ఫోన్లో మాట్లాడారు. మరో నాలుగు రోజులు సెంటర్ కొనసాగించి పూర్తి ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్ను కోరారు. రేపటి నుంచి వడ్లు కొనుగోలు చేయమని రైతులు భయపడేలా చేసిన ఐకేపీ అధికారిని ఎమ్మెల్యే మందలించారు.
నెలలు గడుస్తున్నా రహదారులపైనే ధాన్యపు రాశులు
మొలకెత్తిన ధాన్యాన్ని షరతులు
లేకుండా కొనుగోలు చేయాలి
ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి