
ఎండు గంజాయి పట్టివేత
నవీపేట: మండల కేంద్రంలో శుక్రవారం డిస్ట్రిక్ట్ టాస్క్ఫోర్స్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి ఎండు గంజాయిని పట్టుకున్నారు. రైల్వే స్టేషన్, శివాజీ చౌక్ సమీపంలో దాడులు చేసి పురుషోత్తం, ఖురేషి చోటుమియాలను సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద సోదాలు నిర్వహించగా ఇద్దరి దగ్గర 200 గ్రాముల చొప్పున ఎండు గంజాయి లభ్యమైంది. నిందితులను అదుపులోకి తీసుకుని ఎస్హెచ్వోకు అప్పగించారు. టాస్క్ ఫోర్స్ సీఐ విలాస్, ఎస్సై సింధు, సిబ్బంది చంద్రమోహన్, నీలిరాజు, కిరణ్కుమార్, నర్సయ్య చారి, సాగర్రావ్, సలీమ్, భూమేశ్వర్, గోపి, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
ఆవులను ఎత్తుకెళ్లేందుకు యత్నం
ఖలీల్వాడి: నగరంలోని ఆకుల పాపయ్య రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి ఆవులకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఎత్తుకెళ్లేందుకు యత్నించినట్లు నాలుగోటౌన్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. దుండగులు ఉదయం 3.30 గంటల ప్రాంతంలో ఓ ఆవుకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి కారులో తరలించేందుకు ప్రయత్నించగా స్థానికులు గమనించి కేకలు వేశారు. వెంటనే దుండగులు ఆవును వదిలి కారులో పరారైనట్లు తెలిపారు. ఆవుల యాజమాని అంజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
కేబుల్ వైర్ల చోరీ నిందితుడి పట్టివేత
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని ఆయా గ్రామాల్లోని బోరుబావుల వద్ద కేబుల్ వైర్లు దొంగిలిస్తున్న నిందితుడిని స్థానిక రైతులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మండల కేంద్రంలోని మత్తడికిందిపల్లెకు చెందిన ధారావత్ రాములు అనే వ్యక్తి గత కొంతకాలంగా బోరు బావుల వద్ద కేబుల్ వైర్లు చోరీ చేస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం బోరు బావి వద్ద కేబుల్ వైర్లు చోరీ చేస్తుండగా రైతులు పట్టుకొని మండల కేంద్రానికి తీసుకొచ్చి కేబుల్ మెడలో వేసి ఊరేగించారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ విషయమై ఎస్సై వెంకట్రావును వివరణ కోరగా ధారావత్ రాములును రైతులు అప్పగించినట్లు తెలిపారు. విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు.
మేకలపై చిరుత దాడి
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని మాలోత్ సంగ్యా నాయక్ తండాలో ఆరు మేకలపై చిరుత దాడి చేసి హతమార్చినట్లు తండావాసులు శుక్రవారం తెలిపారు. తండాకు చెందిన నేనావత్ శివరాం, నేనావత్ లక్ష్మణ్కు చెందిన మేకలు తండా సమీపంలోని గుట్ట ప్రాంతంలో మేతకు వెళ్లాయి. అదే సమయంలో అటవీ ప్రాంతంలో నుంచి వచ్చిన చిరుత ఆరు మేకలపై దాడి చేయగా, మృతిచెందినట్లు బాధితులు తెలిపారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా ఘటన స్థలానికి బీట్ అధికారి సాయికిరణ్ చేరుకొని వివరాలు సేకరించారు. అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని బాధితులు కోరారు.
వివాహిత అదృశ్యం
రుద్రూర్: పోతంగల్ మండలం జల్లాపల్లి పారంకు చెందిన వివాహిత (20) అదృశ్యమైనట్టు ఎస్సై సునీల్ శుక్రవారం తెలిపారు. ఈ నెల 11న ఎవరికి చెప్పకుండా ఆమె ఇంటి నుంచి వెళ్లి, ఇప్పటికీ తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు ఎంత వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో వివాహిత భర్త హైమద్ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.

ఎండు గంజాయి పట్టివేత