ఆటలు సరే.. ఆడే చోటేది?
భైంసారూరల్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీఎం కప్ క్రీడలు ప్రభుత్వ పాఠశాలల్లో ఆవరణల్లో నిర్వహిస్తున్నారు. మండల స్థాయిలో ప్రత్యేక మైదానాలు లేకపోవడంతో కబడ్డీ, ఖోఖో, షటిల్ పోటీలతో సరిపెట్టారు. క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని పాలకులు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితిలు భిన్నంగా ఉన్నాయి. ఇవి విద్యార్థుల శారీరక అభివృద్ధికి అడ్డంకిగా మారుతున్నాయి.
మాటలు కాదు చేతలు కావాలి..
క్రీడలు మానసిక శక్తి, శారీరక దృఢత్వాన్ని పెంచుతాయని ప్రసంగాల్లో పోటీల ప్రారంభం సందర్భంగా నేతలు ప్రసంగాలు చేస్తారు. కానీ, పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయులు, విశాల స్థలాలు లేవు. గ్రామీణ పిల్లల్లో కబడ్డీ, యోగా, కరాటేలో ప్రతిభ ఉన్నప్పటికీ, సదుపాయాల కొరత వారిని వెనక్కి నెడుతోంది. జిల్లా, రాష్ట్రస్థాయిలో సత్తా చాటే నైపుణ్యం ఉన్నా.. దీర్ఘకాలిక శిక్షణ లేకపోవడంలో గ్రామీణ క్రీడాకారులు వెలుగులోకి రావడం లేదు.
స్థలాల కొరత..
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు 5 ఎకరాలు, ప్రాథమికోన్నత పాఠశాలలకు 3 ఎకరాలు అవసరమని మార్గదర్శకాలు ఉన్నాయి. కానీ, మెజారిటీ పాఠశాలలకు ఎకరం నుంచి రెండెకరాలకు మించి స్థలాలుల ఏవు. ఇక ప్రైవేటు పాఠశాలల్లో అయితే పరిస్థితి దారుణంగా ఉంది. తరగతి గదులే ఇరుకుగా ఉంటున్నాయి. ఆటలకు ఇక చోటే ఉండడం లేదు. యోగా సెషన్లు కూడా సరైన స్థలాలు లేక ఆగిపోతున్నాయి.
ప్రోత్సహిస్తే జాతీయ స్థాయికి..
ప్రతీ పాఠశాలకు అనుబంధ మైదానాలు, వ్యాయామ శిక్షకులు, సామగ్రి సరఫరా తప్పనిసరి. పిల్లల ఆసక్తి ఆధారంగా శిక్షణ ఇస్తే జాతీయ క్రీడాకారులు ఎదుగుతారు. ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపు, మానిటరింగ్లో దృష్టి పెట్టాలి. క్రీడా దినోత్సవాలు ప్రసంగాలకు మాత్రమే కాకుండా, ఆచరణలో పెట్టాలి.


