ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా నిర్వహించాలి
నిర్మల్చైన్గేట్:వరి ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులు, కేంద్రాల నిర్వాహకులతో గురువారం సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లపై అవగాహన కల్పించారు. కొనుగోలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ప్రతీ కొనుగోలు కేంద్రం వద్ద నిర్వాహకుల సమాచారం, టెంట్, తాగునీటి సౌకర్యాలు కల్పించాలన్నారు. కొనుగోలుకు సంబంధించి టోల్ ఫ్రీ నంబరు 9182958858 ను ప్రదర్శించేలా ప్లెక్సీ ఏర్పాటు చేయాలన్నారు. అన్ని రిజిస్టర్లను పకడ్బందీగా నిర్వహిస్తూ, ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని సూచించారు. సరిపడా సిబ్బంది, కూలీలు, లారీలను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. కొనుగోలుకు సంబంధించిన వివరాలను రోజువారీగా అందజేయాలని పేర్కొన్నారు. సన్న, దొడ్డు రకం కొనుగోలు కేంద్రాలు వేర్వేరుగా ఏర్పాటు చేయాలన్నారు.సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, పౌరసరఫరాల అధికారి రాజేందర్, మేనేజర్ సుధాకర్, డీఆర్డీవో విజయలక్ష్మి, వ్యవసాయ అధికారి అంజిప్రసాద్, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
జిల్లాలో వివిధ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లాలో నిర్మాణ పనుల పురోగతిపై వివిధ శాఖల ఇంజినీరింగ్ అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. పనుల వివరాలను ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల పురోగతి, పూర్తి చేయడానికి ఉన్న గడువు ఆరా తీశారు. అధికారులు పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. నిర్ణీత గడువులోగా పూర్తయ్యేలా చూడాలని సూచించారు. సమావేశంలో సీపీవో జీవరత్నం, వివిధ శాఖల ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ అధికారులు సందీప్, వేణుగోపాల్, సునీల్ కుమార్, గంగాధర్గౌడ్ పాల్గొన్నారు.
ఈవీఎం గోదాం తనిఖీ
నిర్మల్ రూరల్ మండలం ఎల్ల పల్లి వద్ద ఉన్న ఈవీఎం, వీవీ ప్యాట్ గోదాంను కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ కిశోర్కుమార్ గురువారం తనిఖీ చేశారు. తాళానికి వేసిన సీల్, సీసీ కెమెరాలో రికార్డు అవుతున్న విధానాన్ని పరిశీలించారు. తనిఖీ రిజిస్టర్లో సంతకం చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవీఎం గోదాం తనిఖీ చేసినట్లు తెలిపారు. తనిఖీ నివేదికను ఎన్నికల సంఘం కార్యాలయానికి పంపించాలని ఎన్నికల సెక్షన్ పర్యవేక్షకులకు సూచించారు.


