
ఆర్టీసీలో స్మార్ట్ జర్నీ
● అన్ని బస్సుల్లో ఆన్లైన్ పేమెంట్స్ ● ప్రయాణికుల చిల్లర సమస్యకు చెక్ ● పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలోనూ స్మార్ట్ టిమ్స్
నిర్మల్టౌన్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు వినూత్న ఆలోచనలతో ముందడుగు వేస్తోంది. వివిధ ఆఫర్లు, టూరిజం ప్యాకేజీలు, ఆక్యుపెన్సీ రేటును పెంచే లక్ష్యంతో సంస్థ లాభాల బాటలో పయనిస్తోంది. తాజాగా ప్రయాణికుల చిల్లర సమస్యను అధిగమించేందుకు డిజి టల్ చెల్లింపుల విధానాన్ని విస్తృతంగా అమలు చేస్తూ స్మార్ట్ పేమెంట్స్కు శ్రీకారం చుట్టింది.
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే చాలా మంది ప్రయాణికులు టికెట్కు సరిపడా చిల్లర లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెద్ద నోట్లతో ప్రయాణించే వారికి చిల్లర తిరిగి ఇవ్వడానికి కండక్టర్లు ఇబ్బంది పడుతున్నారు. ఒక్కోసారి ఇది కండక్టర్ల కు, ప్రయాణికులకు చికాకు తెప్పిస్తుంది. చాలాసార్లు గొడవలు పడిన సందర్భాలూ ఉన్నాయి. మహాలక్ష్మి పథ కం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలైన తర్వాత ఈ సమస్య మరింత తీవ్రమైంది. చిల్లర విషయంలో ప్రయాణికులు, కండక్టర్ల మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిన ఘటనలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఆర్టీసీ డిజిటల్ చెల్లింపులను అందుబాటులోకి తెచ్చింది.
సరళమైన టికెటింగ్ విధానం
టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా క్యూఆర్ కోడ్ స్కానింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్ల ద్వారా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి, యూపీఐ ద్వారా టికెట్ కొనుగోలు చేయవచ్చు. ఈ విధానం చిల్లర సమస్యను పూర్తిగా తొలగించడమే కాకుండా, టికెటింగ్ ప్రక్రియను వేగవంతం అవుతుంది. ఇది కండక్టర్లు, ప్రయాణికుల మధ్య వాగ్వాదాలను తగ్గించి, ప్రయాణ అనుభవాన్ని సౌకర్యవంతంగా మార్చింది.
స్వాగతిస్తున్న ప్రయాణికులు..
ప్రయాణికులు ఈ డిజిటల్ చెల్లింపు విధానాన్ని స్వాగతిస్తున్నారు. చిల్లర సమస్యను తొలగించడమే కాకుండా, సమయాన్ని ఆదా చేస్తుంది. టీజీఎస్ఆర్టీ సీ ఈ చొరవ ద్వారా ఆక్యుపె న్సీ రేటును పెంచడం, సంస్థను లాభాల బాటలో నడిపించడం లక్ష్యంగా పెట్టుకుంది. మహాలక్ష్మి పథకం వల్ల ఉచిత ప్రయాణాలు పెరిగినా చెల్లింపు చేసే ప్రయాణికులను ఆకర్షించేందుకు ఈ డిజిటల్ చెల్లింపు విధానం కీలక పాత్ర పోషిస్తోంది. అదనంగా, టూరిజం ప్యాకేజీలు, ఆఫర్లతోపాటు ఈ డిజిటల్ చొరవ సంస్థ సేవా నాణ్యతను మరింత బలోపేతం చేస్తోంది.
నిర్ణయం బాగుంది..
ఆర్టీసీ బస్సుల్లో చిల్ల ర సమస్యకు చెక్ పెట్టేలా డిజిటల్ పేమెంట్ విధానం అందుబాటులోకి తేవడం బాగుంది. ఆన్లైన్ పేమెంట్స్తో ఎటువంటి చిల్లర సమస్యలు ఉండవు. ఎలాంటి బ్బంది లేకుండా హ్యాపీగా ప్రయాణిస్తున్నాము. ఇలాంటి సేవలు తీసుకొచ్చిన ఆర్టీసీకి కతజ్ఞతలు
– మహేష్, నిర్మల్
యూపీఐ సేవల విస్తరణ
చిల్లర సమస్యను పరిష్కరించేందుకు ఆర్టీసీ డిజిటల్ చెల్లింపులను విస్తృతంగా అమలులోకి తెచ్చింది. గతంలో గరుడ, రాజధాని, సూపర్లగ్జరీ, నాన్–స్టాప్ బస్సుల్లో మాత్రమే అందుబాటులో ఉన్న యూపీఐ చెల్లింపులు ఇప్పుడు పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులలో కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈమేరకు కండక్లర్లకు స్మార్ట్ టిమ్లు అందించింది. దీంతో ప్రయాణికులు గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, డెబిట్/క్రెడిట్ కార్డులు వంటి డిజిటల్ చెల్లింపు పద్ధతులను ఉపయోగించి టికెట్లు కొనుగోలు చేయవచ్చు. నిర్మల్ డిపోలోని 71 పల్లెవెలుగు, 36 ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఐదు రోజులుగా ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇది ప్రయాణికులకు ఇబ్బంది లేని అనుభవాన్ని అందిస్తోంది.

ఆర్టీసీలో స్మార్ట్ జర్నీ