
సీఎంఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలి
నిర్మల్చైన్గేట్:జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ రైస్ మిల్లర్లను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్లతో గురువారం సమీక్ష నిర్వహించారు. మిల్లర్లకు నిర్దేశించిన లక్ష్యాలు, ఇప్పటివరకు సరఫరా చేసిన సీఎంఆర్, మిగిలిన ధాన్యం, రోజువారీగా తరలిస్తున్న లారీల వివరాలను రైస్ మిల్లుల వారీగా సమీక్షించారు. ప్రతీ మిల్లర్ గడువులోపు లక్ష్యాన్ని పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత మిల్లర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక నుంచి రైస్ మిల్లర్లు ప్రభుత్వ నిబంధనలకు లోబడి ధాన్యాన్ని ప్రభుత్వానికి అందజేస్తామన్న ఒప్పందం చేసుకుంటేనే ధాన్యం కేటాయించడం జరుగుతుందన్నారు. యాక్షన్ ప్యాడికి సంబంధించిన మిగిలిన మొత్తం వెంటనే డిపాజిట్ చేయాలన్నారు. రైస్ మిల్లుల్లో హమాలీల సంఖ్యను పెంచి మిల్లింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. రెవెన్యూ, సివిల్ సప్లయ్స్ అధికారులు మిల్లుల్లో ధాన్యం నిల్వ, సామర్థ్యం, అన్లోడింగ్ పరిస్థితులు తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి, రోజువారీ నివేదికలు అందజేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్, భైంసా ఆర్డీవో కోమల్రెడ్డి, డీఎం సివిల్ సప్లయిస్ సుధాకర్, ఎల్డీఎం రామ్గోపాల్, పౌర సరఫరాల అధికారులు, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.
కలెక్టర్ అభిలాష అభినవ్