ప్రియుడు పూవరసన్, భానుప్రియ
కర్ణాటక: దేశ రక్షణ కోసం పోరాడే జవాన్, మాజీ జవాన్కు సొంత ఇంట్లోనే భద్రత లేకుండా పోయింది. మూడు రోజుల క్రితం క్రిష్ణగిరి సమీపంలో కాలిన స్థితిలో బయటపడిన మృతదేహాల కేసును పోలీసులు ఛేదించారు. తండ్రీకుమారుడు హత్యకు గురికాగా, కోడలి అక్రమ సంబంధమే ఇంత ఘోరానికి కారణమని తేల్చారు.
ఉలిక్కిపడిన బెల్లారంపల్లి
వెప్పాలంపట్టి సమీపంలో కాలిన స్థితిలో ఇద్దరి మృతదేహాలున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. సేలం డీఐజీ సంతోష్, క్రిష్ణగిరి ఎస్పీ తంగదురైలు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదుచేసుకొని, దర్యాప్తు చేపట్టారు. హత్యకు గురైన వ్యక్తులు క్రిష్ణగిరి సమీపంలోని బెల్లారంపల్లి గ్రామానికి చెందిన సైనికుడు మాదేశ్ (43), అతని తండ్రి, మాజీ జవాన్ సెల్లప్ప (63)గా గుర్తించారు.
భర్త జమ్మూకశ్మీర్లో ఉంటే..
మాదేష్ జమ్మూకశ్మీర్లో విధుల్లో ఉండేవాడు. ఈ క్రమంలో అతని భార్య భానుప్రియ (30)పై పోలీసులకు అనుమానం ఏర్పడింది. ఆమెను ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలివ్వడంతో.. పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి తమదైన శైలిలో ప్రశ్నించారు. దాంతో అసలు గుట్టును భానుప్రియ విప్పింది. బెల్లారంపల్లివాసి, జవాన్ మాదేశ్ (43) జమ్మూకశ్మీర్లో పని చేసేవాడు. ఈ క్రమంలో భానుప్రియకు స్థానికంగా ఉండే వ్యాన్ డ్రైవర్ పూవరసన్ (24) అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది.
వీరి తతంగమంతా గ్రామస్థులకు తెలిసింది. భర్త మాదేశ్కు కూడా విషయం తెలియడంతో.. ఆయన ఆగ్రహంతో ఈ నెల 10వ తేదీన హఠాత్తుగా ఊరికి వచ్చి భార్యను నిలదీసి దండించాడు. భానుప్రియ ఈ సంగతిని ప్రియునికి చెప్పింది. పథకం ప్రకారం ప్రియుడు పూవరసన్ ఆ రోజు రాత్రి కత్తితో భానుప్రియ ఇంటికెళ్లి మాదేశ్పై దాడి చేశాడు. మాదేశ్ కేకలు వేయడంతో తండ్రి, మాజీ జవాన్ సెల్లప్ప బయటకొచ్చాడు. వారిద్దరిపై భానుప్రియ, ప్రియుడు కత్తులతో విరుచుకుపడి హత్య చేశారు. శవాలను వ్యాన్లో తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు నిందితులు వివరించారు. ఈ కేసు చుట్టుపక్కల గ్రామాల్లో తీవ్ర సంచలనం కలిగిస్తోంది.


