ఢిల్లీ: అనారోగ్యంతో ఉన్న తన తల్లిని చూసుకోవడానికి, తన మామ మరణానంతర కర్మకాండలలో పాల్గొనడానికి అనుమతి కోరుతూ 2020 ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసు నిందితుడు, జేఎన్యూ విద్యార్థి కార్యకర్త ఉమర్ ఖాలిద్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ను ఢిల్లీ కోర్టు మంగళవారం కొట్టివేసింది.
ఈ కేసును విచారించిన ఢిల్లీలోని కర్కర్డూమా కోర్టు అదనపు సెషన్స్ జడ్జి సమీర్ బాజ్పాయ్.. మధ్యంతర బెయిల్ పిటిషన్ను తిరస్కరించారు. ఉమర్ ఖలీద్ మధ్యంతర బెయిల్కు సంబంధించి చూపించిన కారణాలను అసమంజసమైనవి పేర్కొంటూ ఆ బెయిల్ పిటిషన్ను కొట్టేశారు.
ఢిల్లీలో 2020లో జరిగిన అల్లర్లలో 53 మంది మరణించగా, 700 మందికి పైగా గాయపడ్డారు. ఈ అల్లర్లకు సూత్రధారులు అనే ఆరోపణలపై ఉమర్ ఖాలిద్తోపాటు, పలువురిపై ఉగ్రవాద నిరోధక చట్టమైన చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (ఉపా) కింద కేసులు నమోదు చేశారు.
ఇదిలా ఉంచితే, 2020 ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసు నిందితులు ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్లకు బెయిల్ నిరాకరిస్తూ జనవరిలో తానిచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు తానే అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
‘బెయిల్ నియమం, జైలు మినహాయింపు అనేది కేవలం వట్టి నినాదం కాదని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ల ధర్మాసనం.. నిన్న ఒక కేసు విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది.నార్కో–టెర్రర్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న జమ్మూకశ్మీర్లోని హంద్వారాకు చెందిన సయ్యద్ ఇఫ్తికార్ అంద్రాబీకి సోమవారం బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.


