ఇదేం టీకా విధానం?

Supreme Court asks Centre about COVID vaccine-procurement policy - Sakshi

టీకా ధరలపై ఏకీకృత విధానం లేదా?

సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలను వాటి మానాన వదిలేస్తారా

గ్రామీణులు, నిరక్షరాస్యులకు ‘కోవిన్‌’ రిజిస్ట్రేషన్‌ ఎలా

వయస్సులవారీగా టీకాలివ్వాలన్న నిర్ణయం హేతుబద్ధమేనా

కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం

దేశవ్యాప్తంగా ఒకే ధరల విధానం ఉండాలని సూచన

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కోవిడ్‌ టీకా విధానంపై సుప్రీంకోర్టు సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. టీకా విధానంలోని తప్పుల్ని ఎత్తి చూపుతూ ప్రశ్నల వర్షం కురిపించింది. టీకాల ఉత్పత్తి, సేకరణ నుంచి ప్రజలకు వయస్సుల వారీగా టీకాలను ఇవ్వాలన్న నిర్ణయం వరకు.. టీకాల ధరల నుంచి, టీకా కోసం ‘కోవిన్‌’యాప్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం తప్పనిసరి చేయడం వరకు.. ప్రభుత్వ విధాన నిర్ణయాలను తీవ్రంగా తప్పుబట్టింది. విధానపరమైన నిర్ణయాలు తీసుకునే స్థానంలో ఉన్నవారు క్షేత్ర స్థాయి పరిస్థితులపై అవగాహన కలిగి ఉండాలని వ్యాఖ్యానించింది.

మునుపెన్నడూ ఎరగని ఇలాంటి మహమ్మారిని ఎదుర్కొనేందుకు అత్యంత అప్రమత్తత అవసరమని పేర్కొంది. టీకా ధరలు దేశవ్యాప్తంగా ఒకేలా ఉండేలా చూడమని కేంద్రాన్ని ఆదేశించింది. ‘కోవిన్‌’ యాప్‌లో కచ్చితంగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్న నిర్ణయం తీసుకునే ముందు డిజిటల్‌ ఇండియా వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలని సూచించింది. దేశ ప్రజలందరికీ అది సాధ్యమేనా అన్న విషయం ప్రభుత్వం ఆలోచించలేదని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్‌ సేవల సౌలభ్యం ఎంత? నిరక్షరాస్యులైన గ్రామీణులు ఎలా రిజిస్టర్‌ చేసుకోగలరు? అని జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ ఎల్‌ఎన్‌రావు, జస్టిస్‌ రవీంద్ర భట్‌ సభ్యులుగా ఉన్న ప్రత్యేక ధర్మాసనం ప్రశ్నించింది.

వాస్తవ పరిస్థితులను గమనిస్తూ, తదనుగుణంగా ఎప్పటికప్పుడు విధాన నిర్ణయాల్లో మార్పులు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. దేశంలో డిజిటల్‌ నిరక్షరాస్యత అధికంగా ఉందని వ్యాఖ్యానించింది. ధర్మాసనం ప్రశ్నలకు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సమాధానమిస్తూ.. రెండో డోసు టీకా వేసుకోవాల్సిన వారిని గుర్తించడానికి ‘కోవిన్‌’లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం తప్పనిసరి చేశామన్నారు. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్‌ కోసం కమ్యూనిటీ సెంటర్లు ఉన్నాయన్నారు. దీనిపై.. ఇదంతా సాధ్యమేనా? అని కోర్టు ప్రశ్నించింది. అలాగే, సంబంధిత విధాన నిర్ణయ పత్రాన్ని తమ ముందుంచాలని ఆదేశించింది. కోవిడ్‌ టీకా నిర్వహణపై సుమోటోగా ఈ కేసును కోర్టు విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే.

పంజాబ్, ఢిల్లీ సహా పలు రాష్ట్రాలు టీకాల కోసం గ్లోబల్‌ టెండర్లను పిలవాలని నిర్ణయించడం, ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ బీఎంసీ ఇప్పటికే కొన్ని బిడ్లను స్వీకరించడాన్ని ప్రస్తావిస్తూ.. ‘రాష్ట్రం లేదా ఏదైనా మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్వయంగా టీకాలను సేకరించుకోవచ్చన్నది కేంద్ర ప్రభుత్వ నిర్ణయమా? లేక కేంద్రం నోడల్‌ ఏజెన్సీగా ఉండి టీకాలను కొనుగోలు చేసి, రాష్ట్రాలకు సరఫరా చేస్తుందా? అని ధర్మాసనం ప్రశ్నించింది. టీకా కొనుగోలు, పంపిణీపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై తమకు స్పష్టత కావాలని, సంబంధిత ఫైల్స్‌ను తమకు అందించాలని ఆదేశించింది. ‘45 ఏళ్లు పైబడిన వారందరికీ కేంద్రమే టీకాలను కొనుగోలు చేసి రాష్ట్రాలకు పంపించింది.

18 నుంచి 44 ఏళ్ల వయస్సున్నవారి విషయంలో రెండు విధానాలు అవలంబిస్తోంది. దాని ప్రకారం.. 50% టీకాలను ఉత్పత్తి సంస్థలు కేంద్రం నిర్ణయించిన ధరకు రాష్ట్రాలకు సరఫరా చేయాలి. మిగతా 50% ప్రైవేటు ఆసుపత్రులకు సరఫరా చేయాలి.ఈ నిర్ణయం వెనుక హేతుబద్ధత ఏమిటి?’ అని ధర్మాసనం ప్రశ్నించింది. కేంద్రం కన్నా రాష్ట్రాలకు ఎక్కువ ధర ఎందుకు నిర్ణయించారని ప్రశ్నించింది. అలాగే, టీకాలకు ధరలను నిర్ణయించే అధికారం ఉత్పత్తి సంస్థలకు ఇవ్వకుండా, కేంద్రమే దేశవ్యాప్తంగా ఒకటే ధరను నిర్ణయించాలి కదా!? అని వ్యాఖ్యానించింది. అలాగే, 45 ఏళ్లు పైబడినవారిపైనే కరోనా ప్రభావం ఎక్కువ ఉంటుందని కేంద్రం చెప్పిందని, కానీ రెండో వేవ్‌లో 18 నుంచి 44 ఏళ్ల వయస్సున్నవారిపైనే అది ఎక్కువ ప్రభావం చూపిందని గుర్తు చేసింది. మే 1 నుంచి మే 24 మధ్య నమోదైన కోవిడ్‌ కేసుల్లో దాదాపు 50% 18 – 44 వయస్సు వారిలోనే నమోదైనట్లు గణాంకాలు తెలుపుతున్నాయి.  

ద్వంద్వ ధరల విధానం వద్దు
టీకా ధరల విధానాన్ని కూడా కోర్టు తప్పుబట్టింది. కేంద్రానికి, రాష్ట్రాలకు వేర్వేరు ధరలు ఎందుకని ప్రశ్నించింది. సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలను వ్యాక్సిన్ల కోసం మీలో మీరే పోటీ పడండి అని  వాటి మానాన వాటిని వదిలేయడం సరికాదని వ్యాఖ్యానించింది. భారత్‌ రాష్ట్రాల సమాఖ్య అని రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 1 స్పష్టంగా చెబుతోందని పేర్కొంది. రాష్ట్రాలను తమలో తామే పోటీ పడమని కేంద్రం వదిలేసింది అనడం సరికాదని తుషార్‌ మెహతా వాదించారు. రాష్ట్రాలకు అందించే టీకా ధరపై కేంద్రమే ఉత్పత్తి సంస్థలతో మధ్యవర్తిత్వం జరిపిందన్నారు. అయినా, ఇలాంటి విధాన నిర్ణయాలపై సమీక్షించే అధికారం కోర్టులకు పరిమితంగా ఉంటుందని మెహతా వ్యాఖ్యానించారు. దీనిపై ధర్మాసనం.. ‘మేం ప్రభుత్వం.. సరైనదేదో మాకే తెలుసు అని మీరు భావించకూడదు. అవసరమైతే మేం గట్టిగా నిలదీయగలం’ అని స్పందించింది.

ప్రైవేటు నుంచి  సందేశాలు
‘కోవిన్‌’లో రిజిస్టర్‌ చేసుకోగానే ప్రైవేటు ఆసుపత్రుల నుంచి సందేశాలు వస్తున్నాయని, ప్రైవేటుగా టీకా తీసుకుంటే నలుగురు సభ్యులున్న ఒక కుటుంబం దాదాపు రూ. 4 వేల రూపాయలు చెల్లించాల్సి వస్తోందని ఈ కేసులో ఎమికస్‌ క్యూరీగా ఉన్న సీనియర్‌ న్యాయవాది మీనాక్షి అరోరా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై జస్టిస్‌ భట్‌ స్పందిస్తూ.. ధరను ప్రభుత్వం నిర్ణయించలేదు కాబట్టి.. డిమాండ్‌ పెరిగితే ప్రైవేటు ఆసుపత్రుల్లో వాటి ధర మరింత పెరిగే ప్రమాదముందన్నారు. ‘కోవిన్‌’లో రిజిస్టర్‌ చేసుకున్నవారికి స్లాట్లు దొరకని పరిస్థితి కూడా ప్రస్తుతం నెలకొని ఉందన్నారు. భారత్‌లో అర్హులైన వారందరికీ ఈ సంవత్సరం చివరలోగా వ్యాక్సినేషన్‌ పూర్తి చేస్తామని కేంద్రం కోర్టుకు తెలిపింది. ఫైజర్‌ సంస్థతో టీకాల కొనుగోలుపై చర్చలు జరుపుతున్నామని, అవి సఫలమైతే, మరింత ముందుగానే వ్యాక్సినేషన్‌ ముగుస్తుందని వెల్లడించింది.  

విమర్శించడం మా ఉద్దేశం కాదు
విచారణ చివరలో.. కరోనాను ఎదుర్కొనే విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరును, ఇందుకు  విదేశాంగ మంత్రి జైశంకర్‌ అమెరికా వెళ్లి చర్చలు జరపడాన్ని ధర్మాసనం ప్రశంసించింది. ఎవరినీ విమర్శించాలన్నది తమ ఉద్దేశం కాదని కోర్టు వివరించింది. ఈ సందర్భంగా, వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు ఆటంకం కలిగేలా ఎలాంటి ఆదేశాలు ఇవ్వవద్దని  సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టును కోరారు. ‘టీకా ఉత్పత్తి సంస్థలు పరిమితంగా ఉన్నాయి. ఈ సమయంలో టీకా ధరలపై కోర్టు ఏవైనా ఆదేశాలిస్తే.. టీకా ఉత్పత్తి సంస్థలతో ప్రభుత్వం జరుపుతున్న చర్చలకు ఆటంకం కలుగుతుంది. అది వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై ప్రతికూల ప్రభావం చూపుతుంది’ అని తుషార్‌ మెహతా అభ్యర్థించారు. దీనిపై.. దేశ సంక్షేమానికి అడ్డుతగలాలని కోర్టు భావించడం లేదని ధర్మాసనం పేర్కొంది. తమ ప్రశ్నలు, ఆందోళనలకు రెండు వారాల్లో సమగ్ర అఫిడవిట్‌తో సమాధానమివ్వాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

థర్డ్‌ వేవ్‌పై ఆందోళన
కరోనా మూడో వేవ్‌ చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపనుందన్న వార్తలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గ్రామాలపైనా దీని ప్రభావం భారీగా ఉండబోతోందన్న వార్తలను ప్రస్తావించింది. ఈ వార్తలపై శాస్త్రీయ అధ్యయనం ఏదైనా చేపట్టారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనికి సంబంధించి ప్రత్యేక వ్యాక్సినేషన్‌ విధానాన్ని రూపొందించారా? అని ప్రశ్నించింది. రెమిడెసివిర్‌ వంటి కోవిడ్‌ ఔషధాల ధరలు ఆకాశాన్ని అంటడాన్ని కూడా ధర్మాసనం ప్రస్తావించింది. కేంద్రం మే 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకువచ్చిన కొత్త సరళీకృత విధానం ప్రకారం.. రాష్ట్రాలు తమ టీకా అవసరాల్లో 50% ఉత్పత్తి సంస్థల నుంచి నేరుగా కొనుగోలు చేసుకోవచ్చు. అయితే, కేంద్రం చెల్లిస్తున్న ధర కన్నా ఇది సాధారణంగా ఎక్కువ ఉంటుంది. అలాగే, ప్రైవేటు ఆసుపత్రులు మరింత ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇలా వేర్వేరుగా ధరలను నిర్ణయించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. టీకాల ద్వారా కూడా లాభాలు ఆర్జించాలని కేంద్రం భావిస్తోందని కాంగ్రెస్‌ ఆరోపించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top