ఢిల్లీ: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున 4గంటలకు జరిగిన ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. వివేక్ విహార్లోని భవనంలో మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఇప్పటివరకు 12 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. మంటల్లో చిక్కుకున్నవారి కోసం రెస్క్యూ కొనసాగుతోంది. ఏసీ పేలడంతో మంటలు చెలరేగినట్లు సమాచారం. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో భవనంలో అపార్ట్మెంట్ వాసులు చిక్కుకుపోయారు.
సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అగ్నిప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న రెండో అంతస్తు నుండి మృతదేహాలను వెలికితీశారు. 2,3,4వ అంతస్తుల్లోని ఫ్లాట్లలో మంటలు వ్యాపించాయి. స్వల్ప గాయాలైన ఇద్దరిని చికిత్స నిమిత్తం గురు తేగ్ బహదూర్ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో 12 ఫైర్ ఇంజన్లు, డీడీఎంఏ సిబ్బంది, ట్రాఫిక్ అధికారులు, స్థానిక పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర బృందాలు అక్కడికి చేరుకున్నారు.
స్థానిక మునిసిపల్ కౌన్సిలర్ పంకజ్ లూత్రా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సమాచారం అందగానే నేను అక్కడికి వెళ్లాను. రెండో అంతస్తు వెనుక భాగంలో ఐదు మృతదేహాలు, మరో మృతదేహం వెనుక వైపు, పై అంతస్తులో మూడు మృతదేహాలు కనిపించాయి. మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. డీఎన్ఏ పరీక్షలు చేస్తే తప్ప బాధితుల వివరాలు తెలియవు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని కొందరు అంటున్నారు, కానీ అధికారికంగా నిర్ధారణ కాలేదని తెలిపారు.



