కోల్కతా: త్వరలో భవానీపూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలబడనున్న నేపథ్యంలో ఇన్నాళ్లూ పశ్చిమబెంగాల్ ప్రభుత్వంలో, ఇతర ప్రభుత్వరంగ బోర్డ్లు, అకాడమీలకు మొత్తంగా 23 పదవులకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం రాజీనామా చేశారు. ఈ మేరకు హోం శాఖ, ఇతరత్రాల శాఖల నుంచి ఉత్తర్వులు జారీచేశారు.
రాష్ట్ర ఆరోగ్య మిషన్, రాష్ట్ర వన్యప్రాణి బోర్డ్, ఎకోటూరిజం అడ్వైజరీ బోర్డ్, 125వ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాల కమిటీ, ఉర్దూ అకాడమీ పాలకమండలి, బంగ్లా సంగీత్మండలి ఆర్గనైజింగ్ కమిటీ, ఎస్సీ, ఎస్టీల సలహా మండలి, పారిశ్రామికాభివృద్ధి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు, విపత్తుల నిర్వహణ సంస్థ సహా పలు సంస్థలకు చీఫ్ పదవి నుంచి మమత రాజీనామాచేశారు. లేఖలో ప్రస్తావించకపోయినా, తాను ప్రాతినిధ్యంవహించే ప్రతి ఒక్క సంస్థ నుంచి వైదొలగుతున్నట్లు సంబంధిత ఉత్తర్వులో ప్రస్తావించారు.


