మీ సెల్‌ ఫోన్‌ పగిలినా దానంతట అదే కనురెప్పపాటులో అతుక్కుంటే?

IISER Kolkata And IIT Kharagpur Scientists Discovered A Material Can Repair Itself - Sakshi

ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్‌ సైంటిస్టుల ఆవిష్కరణ   

కోల్‌కతా: మీ సెల్‌ ఫోన్‌ నేలపై పడి పగిలినా దానంతటదే తిరిగి అతుక్కుంటే? వినేందుకు జానపద సినిమాల్లో ఘటనలాగా అనిపిస్తోంది కదా! కానీ ఈ అద్భుతాన్ని నిజం చేసే దిశగా దేశీయ సైంటిస్టులు కీలకమైన ముందడుగు వేశారు. కనురెప్పపాటులో తనంతట తాను రిపేరు చేసుకునే మెటీరియల్‌ను ఐఐఎస్‌ఈఆర్‌ కోల్‌కతా, ఐఐటీ ఖరగ్‌పూర్‌ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనితో స్వీయరిపేర్లు చేసుకునే ఎల్రక్టానిక్‌ గాడ్జెట్లు మనిషి చేతికి వస్తాయి. ఈ ప్రయోగ వివరాలను తాజాగా యూఎస్‌కు చెందిన సైన్స్‌ జర్నల్‌లో ప్రచురించారు.

ఇప్పటికే కొన్నిరకాల సెల్ఫ్‌ హీలింగ్‌ మెటీరియల్స్‌ ఏరోస్పేస్, ఆటోమేషన్‌ రంగంలో అందుబాటులో ఉన్నాయి. అయితే తాజాగా తాము రూపొందించిన ఉత్పత్తి గతంలో వాటి కన్నా పదిరెట్లు గట్టిగా ఉందని సైంటిస్టులు చెప్పారు. అందుబాటులో ఉన్న మెటీరియల్స్‌కు తమంత తాము రిపేరయ్యేందుకు వెలుతురో, వేడో కావాల్సివస్తుండేది. తాజా మెటీరియల్‌ సొంతగా ఉత్పన్నమయ్యే ఎలక్ట్రిక్‌ చార్జితో రిపేరు చేసుకుంటుందని ఐఐటీ ప్రొఫెసర్‌ భాను భూషణ్‌ కతువా చెప్పారు.  

పరిశోధనలో తెలుగువాడు 
నూతన సెల్ఫ్‌ రిపేర్‌ మెటీరియల్‌ రూపకల్పనలో ఐఐఎస్‌ఈఆర్‌ కోల్‌కతా ప్రొఫెసర్‌ సి. మల్లారెడ్డి కీలకపాత్ర పోషించారు. సరికొత్త తరగతికి చెందిన ఘనపదార్ధాల ఉత్పత్తికిగాను, మల్లారెడ్డి, ఆయన బృందానికి 2015లో ప్రతిష్ఠాత్మక స్వర్ణజయంతి ఫెలోషిప్‌ను పొందారు. ఈయనతో పాటు మరో సైంటిస్టు నిర్మాల్యఘోష్‌ సైతం ఇదే సంస్థలో పనిచేస్తున్నారు. ఒత్తిడి ఎదురైనప్పుడు ఎలక్ట్రిక్‌ చార్జిలను సృష్టించే పదార్ధాలే పీజో ఎలక్ట్రిక్‌ పదారాలు. ఈ చార్జిని ఉపయోగించుకొని స్పటికాలు తిరిగి యథాతధ రూపాన్ని పొందుతాయి. జీవ కణాల్లో రిపేరింగ్‌ మెకానిజం ఆధారంగా కొత్త పదార్ధం పనిచేస్తుంది. దీన్ని మెబైల్‌ స్క్రీన్ల నుంచి ఎల్‌ఈడీ స్క్రీన్ల వరకు అన్ని రకాల ఎల్రక్టానిక్‌ వస్తువులకు వాడవచ్చని సైంటిస్టులు చెప్పారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top