ముంబై: నాలుగేళ్ల క్రితం చైనాలో పుట్టిన కోవిడ్-19 ప్రపంచాన్ని కకావికలం చేసింది. అయితే, ఆ సమయంలో కోవిడ్ సోకడంతో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఓ మహిళా పేషెంట్ను చంపేయండి అంటూ ఇద్దరు డాక్టర్ల మధ్య జరిగిన సంభాషణ తాలూకు ఆడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
2021లో మహారాష్ట్ర లాతూర్ జిల్లాలో దయామి అజిమోద్దీన్ గౌసోద్దీన్ భార్య కౌసర్ ఫాతిమాకు కోవిడ్-19 సోకింది. దీంతో చికిత్స చేయించుకునేందుకు లాతూర్లోని ఉద్గిర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఆస్పత్రిలో కోవిడ్ -19 కేర్ సెంటర్లో విధులు నిర్వహించిన డాక్టర్ శశికాంత్ డాంగే, అదనపు జిల్లా సర్జన్ డాక్టర్ శశికాంత్ దేశ్పాండే మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్ ఇటీవల సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది
జస్ట్ కిల్ డయామీ ఉమెన్
ఆ ఆడియో క్లిప్లో దేశ్ పాండే.. శశికాంత్ డాంగేతో ఇలా చెప్పారు. కోవిడ్ వార్డ్లోకి ఇంకా ఎవర్నీ అనుమతించొద్దు. జస్ట్ కిల్ డయామీ ఉమెన్ అని దేశ్ పాండే ఆదేశించగా.. అందుకు శశికాంత్ డాంగే.. ఆమెకు అందిస్తున్న ఆక్సిజన్ను మెల్లిమెల్లిగా తగ్గిస్తున్నట్లు చెప్పాడు.
ఇక,బాధితురాలి భర్త ఫిర్యాదుతో ఉదయ్గిర్ సిటీ పోలీసులు డాక్టర్ దేశ్ పాండేపై మే 24న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అతని మొబైల్ను సీజ్ చేశారు. నోటీసులు జారీ చేసి అతని స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. ఈ ఘటనపై తాము ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన ఆ ఆడియో క్లిప్ను పరిశీలిస్తున్నట్లు ఎస్సై దిలీప్ గాడే తెలిపారు. డాక్టర్ డాంగే ప్రస్తుతానికి అందుబాటులో లేడని, వచ్చిన వెంటనే అతనిని విచారిస్తామన్నారు.
కేసు పూర్వపరాల్ని పరిశీలిస్తే..
కేసు పూర్వపరాల్ని పరిశీలిస్తే.. ఎఫ్ఐఆర్ ఆధారంగా.. 2021లో తన భార్య కౌసార్ ఫాతిమాకు కోవిడ్-19 సోకింది. అదే ఏడాది ఏప్రిల్ 15న ఉద్గీర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది.
భోజనం చేస్తున్న డాక్టర్ పక్కనే బాధితురాలి భర్త
ఆ ఆస్పత్రికి ఎదురుగా ఉన్న నాందేడ్ రోడ్డులో ఉన్న ఓ కంటి ఆస్పత్రిలో కోవిడ్ వార్డ్లో చికిత్స అందిస్తున్నారు. ఆ కోవిడ్ వార్డ్లో పేషెంట్లకు డాక్టర్ శశికాంత్ డాంగే ట్రీట్మెంట్ ఇస్తున్నారు. పది రోజుల పాటు ఫాతిమా ఆ వార్డ్లో చికిత్స తీసుకున్నారు. ఏడవ రోజు వార్డులో భోజనం చేస్తున్న డాక్టర్ డాంగే పక్కనే ఫాతిమా భర్త కూర్చున్నాడు.
అలా చంపడం మీకు అలవాటే కదా
ఆ సమయంలో డాక్టర్ డాంగేకు.. డాక్టర్ దేశ్పాండే ఫోన్ చేశారు. ఫోన్ స్పీకర్ ఆన్లోనే ఉంది. ఫోన్ మాట్లాడే సమయంలో కోవిడ్ వార్డ్లో బెడ్లు,ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయా? లేవా? అని అడిగారు. అందుకు డాక్టర్ డాంగే ఖాళీ బెడ్లు లేవని చెప్పాడు. వెంటనే డాక్టర్ దేశ్పాండే దయామి రోగిని చంపేయండి. అలా చంపడం మీకు అలవాటే కదా’ అని చెప్పిన విషయాన్ని పక్కడనే ఉన్న ఫాతిమా భర్త విన్నాడు. కానీ ఏమీ అనలేకపోయాడు. భార్యకు ట్రీట్మెంట్ అందుతున్న సమయంలో మాట్లాడటం కరెక్ట్ కాదనుకున్నాడు. ఆ ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత ఫాతిమా కోవిడ్ నుంచి కోలుకున్నారు.
అనూహ్యంగా ఆ సమయంలో ఇద్దరు డాక్టర్ల మధ్య జరిగిన సంభాషణ మే 2, 2025న సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. నాడు తనని కలత పెట్టేలా డాక్టర్లు మాట్లాడారని ఫాతిమా భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.