ఒక్క ఎల్ఐసీలోకి మాత్రం 20 శాతానికే అనుమతి
నోటిఫై చేసిన ఆర్థిక శాఖ
న్యూఢిల్లీ: బీమా రంగంలోకి ఆటోమేటిక్ పద్ధతిలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్డీఐ) అనుమతించడానికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం బ్రోకింగ్ సంస్థలు సహా ఇంటర్మీడియరీలు, బీమా కంపెనీల్లోకి 100 శాతం ఎఫ్డీఐలకు అనుమతి ఉంటుంది. అయితే, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో (ఎల్ఐసీ) మాత్రం 20 శాతం పరిమితి అమలవుతుంది. ఈ మేరకు ఫారిన్ ఎక్చ్సేంజ్ మేనేజ్మెంట్ (ఫెమా) 2026 నిబంధనలను సవరించారు. బీమా రంగంలో ఆటోమేటిక్ మార్గంలో ఎఫ్డీఐలను 74 శాతం నుంచి 100 శాతానికి పెంచడానికి సంబంధించిన సబ్కా బీమా సబ్కీ రక్షా బిల్లు 2025ని 2025 డిసెంబర్లో పార్లమెంటు ఆమోదించింది.
ఆ తర్వాత 2026 ఫిబ్రవరిలో కేంద్ర వాణిజ్య శాఖలో భాగమైన పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) దీన్ని నోటిఫై చేసింది. మరోవైపు, 10 శాతం వరకు చైనా వాటాలున్న విదేశీ కంపెనీలు భారత్లో ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) పెట్టేందుకు వెసులుబాటు కల్పిస్తూ కూడా ఆర్థిక శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం చైనా/హాంకాంగ్ పెట్టుబడులు 10 శాతం వరకు ఉన్న విదేశీ కంపెనీలు, భారత్లో ఎఫ్డీఐలకు అనుమతి ఉన్న రంగాల్లో, ఆటోమేటిక్ మార్గంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే, చైనా, హాంకాంగ్లతో పాటు భారత్తో సరిహద్దులు పంచుకుంటున్న దేశాల్లో రిజిస్టరయిన సంస్థలకు మాత్రం ఇది వర్తించదు. ఇప్పటివరకు కనీసం చైనా వాటా ఒక్క శాతం ఉన్నా భారత్లో ఇన్వెస్ట్ చేయాలంటే తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటోంది. 2000 నుంచి 2025 డిసెంబర్ వరకు భారత్లోకి వచ్చిన మొత్తం ఎఫ్డీఐల్లో 0.32 శాతం వాటాతో (2.51 బిలియన్ డాలర్లు) చైనా 23వ స్థానంలో ఉంది.


