చెన్నై: తమిళ చలనచిత్ర పరిశ్రమలో మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం అనంతరం ప్రముఖ దర్శకుడు, నటుడు, సుందర్ సి రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఆయన మదురై సెంట్రల్ నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి ఐటీ శాఖ మంత్రి పళనివేల్ త్యాగరాజన్ (PTR) ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఈయననే డీఎంకే (DMK) మళ్ళీ బరిలోకి దించే అవకాశం ఉండటంతో, ఇక్కడ అత్యంత ప్రతిష్టాత్మకమైన పోటీ నెలకొననుంది. సుందర్ సి భార్య, ప్రముఖ నటి ఖుష్బూ సుందర్ ఇప్పటికే రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. ఆమె ప్రస్తుతం బీజేపీ తమిళనాడు రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
దర్శకుడి భార్య ఖుష్బూ స్పందిస్తూ.. ‘సినీ కెరీర్లో మూడు దశాబ్దాల పాటు నా భర్తకు ఈ రాష్ట్ర ప్రజలు మద్దతుగా నిలిచారని.. అందుకే ఇప్పుడు వారికి సేవ చేయడమే లక్ష్యంగా ఎన్నికల బరిలో దిగారు. ఆయన భార్యగా నేను గర్వపడుతున్నా’’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.
సుందర్ సి (సుందర్వేల్ చిదంబరం) జనవరి 21, 1968న జన్మించారు. ఆయన 1990లో ‘వాళ్కై చక్కరం’తో నటుడిగా చిత్ర రంగంలోకి అడుగుపెట్టారు. 1995లో ‘మురై మానమ్’తో దర్శకుడిగా మారారు. దాదాపు 37 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 10కి పైగా సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. కళైమామణి పురస్కారాన్ని అందుకున్నారు. తన భార్యతో కలిసి పలు టెలివిజన్ సిరీస్లను నిర్మించారు.


