ఉత్సాహంగా స్పోర్ట్స్‌ స్కూల్‌ ఎంపికలు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా స్పోర్ట్స్‌ స్కూల్‌ ఎంపికలు

Apr 1 2026 8:12 AM | Updated on Apr 1 2026 8:12 AM

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ప్రధాన స్టేడియంలో మంగళవారం జిల్లాస్థాయి స్పోర్ట్స్‌ స్కూల్‌ సెలక్షన్స్‌ ఉత్సాహంగా జరిగాయి. విద్యార్థులకు స్పోర్ట్స్‌ స్కూళ్లలో 4వ తరగతిలో ప్రవేశాల కోసం జిల్లాస్థాయి ఎంపికలు నిర్వహించగా.. 31 మంది బాలురు, 15 మంది బాలికలు హాజరయ్యారు. విద్యార్థుల పేర్లు నమోదు చేయడంతోపాటు నిబంధనల మేరకు వయస్సు నిర్ధారణ ధ్రువీకరణ, ఇతర పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు శారీరక దారుఢ్య అంశాల్లో పరీక్షలు నిర్వహించారు. ఎత్తు, బరువు, ఫ్లెక్సిబిలిటీ, వర్టికల్‌ జంప్‌, స్టాండింగ్‌ బ్రాడ్‌ జంప్‌, మెడిసన్‌ బాల్‌త్రో, 30 మీటర్ల ఫ్లయింగ్‌ స్టార్ట్‌, 6 గీ 10 మీటర్ల షటిల్‌ రన్‌, 800 మీటర్ల రన్నింగ్‌ అంశాల్లో పరీక్షలు కొనసాగాయి. ఎంపికలను డీవైఎస్‌ఓ శ్రీనివాస్‌ పర్యవేక్షించారు. జిల్లాస్థాయిలో ఎంపికై న విద్యార్థుల వివరాలను త్వరలో విడుదల చేస్తామని వెల్లడించారు. జిల్లాస్థాయిలో ఎంపికై న విద్యార్థులు హైదరాబాద్‌లోని హకీంపేటలో వచ్చేనెల 1న జరిగే రాష్ట్రస్థాయి సెలక్షన్స్‌లో పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్లు రాజగోపాల్‌, కిషోర్‌కుమార్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ రవీందర్‌రెడ్డి, కోచ్‌లు సునీల్‌కుమార్‌, ఎండీ ఖలీల్‌, పర్వేజ్‌పాష, నికేష్‌, అంజద్‌ తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి

‘పది’ స్పాట్‌ వ్యాల్యువేషన్‌

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు కొనసాగుతుండగా.. మరోవైపు పేపర్ల వ్యాల్యువేషన్‌ ప్రక్రియను చేపట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా జిల్లాకేంద్రంలోని మహబూబ్‌నగర్‌ గ్రామర్‌ స్కూల్‌లో అధికారులు ఏర్పాటు చేయనున్నారు. జవాబు పత్రాలు 48 వేలకుపైగా ఇప్పటికే ఇక్కడికి చేరాయి. పూర్తిస్థాయిలో వ్యాల్యువేషన్‌, స్కానింగ్‌ ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానున్నట్లు డీఈఓ ప్రవీణ్‌కుమార్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పేపర్‌ వ్యాల్యువేషన్‌ కోసం మొత్తం 1,100 మంది ఉపాధ్యాయులను కేటాయించామని, ఈ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు వివరించారు.

ఓపెన్‌ యూనివర్సిటీ

ప్రాక్టికల్స్‌

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ సైన్స్‌ సబ్జెక్టు సెమిస్టర్‌–1కు సంబంధించి ప్రాక్టికల్స్‌ బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌టికెట్‌, ఐడీ కార్డు, ఫీజులు చెల్లించిన రశీదుతో రావాలని కోఆర్డినేటర్‌ సత్యనారాయణగౌడ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి సమాచారం కోసం సెల్‌ నం.73829 29609ను సంప్రదించాలని సూచించారు.

కందూర్‌ హుండీ లెక్కింపు

అడ్డాకుల: మండలంలోని కందూర్‌ రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద మంగళవారం స్వామి వారి హుండీని లెక్కించారు. స్వామివారి బ్రహోత్సవాలు, జాతర ముగిసిన నేపథ్యంలో భక్తులు సమర్పించిన కానుకలు, నగదును లెక్కించారు. ఆలయ నిర్వాహకులు, గ్రామస్తుల సమక్షంలో లెక్కింపు జరిగింది. రూ.5,17,591ల నగదు స్వామివారి హుండీ ద్వారా ఆలయానికి ఆదాయం సమకూరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement