
పంద్రాగస్టులోగా దరఖాస్తులను పరిష్కరించాలి
నారాయణపేట: జిల్లాలోని అన్ని మండలాలలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులలో రైతుల నుంచి వచ్చిన భూ సమస్యల దరఖాస్తులను ఆగస్టు 15 ( పంద్రాగస్టు) లోపే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. శుక్రవారం రాత్రి కలెక్టరేట్లోని తన ఛాంబర్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, ట్రైని కలెక్టర్ ప్రణయ్ కుమార్తో కలిసి అన్ని మండలాల తమసీల్దార్లతో కలెక్టర్ భూభారతి పెండింగ్ దరఖాస్తులపై సమీక్షించారు. మండలాల వారీగా ఎన్ని దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని ఆరా తీశారు. ఇప్పటి వరకు పరిష్కరించిన, తిరస్కరించిన వాటిపై చర్చించారు. 200లోపు పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వారం రోజుల్లో పరిష్కరించాలని, ఏదైనా సమస్యాత్మకంగా ఉంటే ఉన్నతాధికారులను సంప్రదించి సలహాలు సూచనలు తీసుకోవాలన్నారు. సమీక్షలో ఆర్డిఓ రామచంద్రనాయక్, అన్ని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల, అర్బన్ హెల్త్ సెంటర్ను శుక్రవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 9:15 గంటలకు కలెక్టర్ స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు వెళ్లి ప్రార్థన లో పాల్గొని, ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. నిర్ణీత సమయానికి ఎంత మంది ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చారని ఆరా తీశారు. అనంతరం అర్బన్ హెల్త్ సెంటర్ను తనిఖీ చేశారు. హెల్త్ సెంటర్లో మొత్తం ఎంతమంది వైద్య సిబ్బంది పనిచేస్తున్నారని, ప్రస్తుతం ఎంతమంది ఉన్నారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. హాజరు రిజిస్టర్ పరిశీలించి ఇద్దరు మెడికల్ ఆఫీసర్లతోపాటు మరో ఐదుగురు స్టాఫ్ రాలేదని నిర్ధారించారు.