
‘నా ఇల్లు అమ్మి అయినా సరే బిల్లులు ఇస్తా..’
మక్తల్: ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేసుకోవాలని.. నిధులు అందవనే భయంతో లబ్ధిదారులు నిర్మాణాలు ప్రారంభించకపోవడం సరికాదని, అవసరమైతే తన ఇల్లు, ఆస్తులు అమ్మి అయినా సరే డబ్బులు చెల్లిస్తానని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం మక్తల్లో ఇందిరమ్మ ఇల్లు మంజూరైన మున్సిపాలిటీలోని 291 మంది, మండలంలోని 600 మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్లను మంత్రి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరయ్యాయని, ఇందుకుగాను రూ.175 కోట్లు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగిందని, ఎవరూ దళారులను ఆశ్రయించవద్దని, ఒకవేళ ఎవరైన దళారులకు డబ్బులు ఇస్తే వారిపై చర్యలు తీసుకొని పార్టీ నుండి బహిష్కరిస్తామని అన్నారు. కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ అని, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే ఇళ్ల ప్రొసీడింగ్లను అందజేసిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కిందని అన్నారు. విడతల వారీగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని, గ్రామాల్లో పెంకుటిల్లు కనిపించకూడదని అన్నారు. రైతులకు సైతం రుణమాఫీ చేసిందని అన్నారు.
ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి : కలెక్టర్
కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. లబ్ధిదారులందరూ ఇళ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని, అధికారులు విధిగా పరిశీలించి ఇళ్ల నిర్మాణాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ డీఈ పిడి శంకర్, కమిషనర్ శంకర్నాయక్, ఎంపీడీఓ రమేస్, తహసీల్దార్ సతీష్కుమార్, మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్కుమార్ పాల్గొన్నారు. ఇదిలాఉండగా, మక్తల్ మున్సిపల్ కార్మికులకు సబ్బులు, నూనె, రేడియం జాకెట్లు అందజేశారు
ఇందిరమ్మ ఇళ్ల బిల్లులపై అపోహలు వద్దు
రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి