
భూ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలి
మద్దూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూ భారతి చట్టం అమలుకు పైలెట్ ప్రాజెక్టు క్రింద ఎంపికై న మద్దూరు మండలంలో రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన సమస్యలను పరిష్కరించే విధంగా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ సిక్తాపట్నాయక్ ఆదేశించారు. గురువారం మద్దూరులోని తహసీల్దార్ కార్యాలయంలో భూ భారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన 1,341 దరఖాస్తుల పరిశీలనపై సమీక్ష నిర్వహించారు. క్షేత్ర పరిశీలన, ప్రొసీడింగ్స్, ల్యాండ్ సర్వే ఎంత వరకు వచ్చిందని భూ భారతి ప్రత్యేకాధికారి యాదగిరిని అడిగి తెలసుకున్నారు. దాదాపు 75 శాతం దరఖాస్తుల పరిశీలన పూర్తయ్యిందని కలెక్టర్కు తెలియజేయగా.. సర్వే పకడ్బందీగా నిర్వహించి భూ సమస్యలను చట్ట ప్రకారం పరిష్కారం చూపే బాధ్యత అధికారులదే అని స్పష్టం చేశారు. ప్రతి సమస్యను ఒకటికి రెండు సార్లు చూసి క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు. ఆర్డీఓ రాంచందర్నాయక్, కొత్తపల్లి, కోస్గి, గుండుమాల్ తహసీల్దార్లు జయరాములు, బక్క శ్రీనివాస్, దయాకర్రెడ్డి పాల్గొన్నారు.