
సమర్థవంతంగా వేసవి శిబిరాలు
నారాయణపేట: జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో వేసవి శిబిరాలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో కలెక్టర్ జిల్లాలో నిర్వహిస్తున్న 50 వేసవి శిబిరాల నిర్వహణ తీరుపై అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, డీఈఓ గోవిందరాజులు, లీడ్బ్యాంక్ మేనేజర్ విజయ్కుమార్, మహిళా సంక్షేమ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో 15 రోజులు పాటు కొనసాగే శిక్షణలో రోజువారి అంశాలను ప్రాధాన్యత క్రమంలో నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి కేంద్రానికి నలుగురు వలంటర్లను నియమించుకొని వంద మంది విద్యార్థులు విధిగా హాజరయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయులదే అన్నారు. ప్రతి రోజు ప్రధానోపాధ్యాయుడితో పాటు సీనియర్ ఉపాధ్యాయులు క్యాంపును సందర్శించి ఆంగ్లం, గణితం, సైన్స్ ఎక్స్పైర్ మెంట్లను నిర్వహించుటకు తగు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. అవసరమైన సందర్భంలో స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోచ్చని సూచిస్తూ కేజీబీవీలో నిర్వహిస్తున్న రెసిడెన్షియల్ సమ్మర్ క్యాంపును మరింత పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. సమీక్షలో మున్సిపల్ కమిషనర్ బోగేశ్వర్, అకడామిక్ మానిటరింగ్ అధికారి విద్యాసాగర్, జీసీడీఓ నర్మద పాల్గొన్నారు.
ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి
ప్రజావాణిలో ఫిర్యాదుదారులు విన్నవించే సమస్యలకు అధిక ప్రాధాన్యతనిస్తూ త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ సిక్తాపట్నాయక్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ప్రజావాణి సమావేశ హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులను కలెక్టర్ స్వయంగా స్వీకరించారు. మొత్తం 32 ఫిర్యాదులు రాగా అత్యధికంగా భూ సమస్యలు ఇతర శాఖలకు సంబంధించినవి వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, ఆర్డీఓ రాంచందర్ నాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పోలీస్ గ్రీవెన్స్కు 11 అర్జీలు
ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్కు 11 అర్జీలు అందాయి. వాటిని పరిశీలించి బాధితులకు న్యాయం అందేలా చూడాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ జిల్లాలో ఆయా ఎస్ఐలను ఫోన్లో ఆదేశించారు. ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలని, స్టేషన్కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించాలని సూచించారు.
భూసేకరణవేగవంతం చేయాలి
నారాయణపేట: నారాయణపేట, మక్తల్, కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ సేకరణ పనులను భూసేకరణ కార్యాలయ అధికారులు, నీటి పారుదల శాఖ అధికారులు సమన్వయంతో నిర్ణీత గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఎత్తిపోతల పథకానికి సంబంధించి పెండింగ్లో ఉన్న భూసేకరణ పనులపై ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ఏఏ సర్వే నంబర్లలో ఎన్ని ఎకరాలను సేకరించాలనే విషయమై ఆరా తీశారు. సర్వే నంబర్లతో పాటు భూసేకరణకు సంబంధించిన పూర్తి వివరాలతో తనకు రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. ఆయా చెరువుల కింద సేకరించాల్సిన భూమి సర్వే నంబర్లతో నివేదికతో పాటు షెడ్యుల్ తయారు చేయాలని కలెక్టర్ సూచించారు. ప్యాకేజీ 1,2 కింద పంప్హౌస్, పైప్లైన్ల ఏర్పాటుకు కోసం భూసేకరణ పూర్తి అయిందని, ప్యాకేజీ 1 కింద పేరపళ్ల జాయమ్మ చెరువు పరిధిలో 219 ఎకరాలను సేకరించాల్సి ఉందని ఇరిగేషన్ ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. సమీక్షలో అడిషనల్ కలెక్టర్ బేన్షాలం, ఆర్డీఓ రాంచందర్ నాయక్, ఇరిగేషన్ ఎస్ఈ శ్రీధర్, ఈఈలు బ్రహ్మనందరెడ్డి, ఉదయశంకర్, ఏడి సర్వే ల్యాండ్ గిరిధర్, ఎస్డీసీ కార్యాలయ అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.