
ధాన్యం తరలింపులో గందరగోళం
మద్దూరు: కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు సరిపడా లారీలను అధికారులు ఏర్పాటుచేయకపోవడం.. అకాల వర్షాలతో ఎక్కడ ధాన్యం తడుస్తుందోనని ఆందోళన చెందిన రైతులు నేరుగా ధాన్యాన్ని వాహనాల్లో మిల్లులకు తరలించడం.. మిల్లుల్లో స్థలం లేదని, కోటా అయిపోయిందంటూ మిల్లర్లు ధాన్యం అన్లోడ్కు నిరాకరించడం.. మొత్తంగా ధాన్యం తరలింపు గందరగోళంగా మారింది. మద్దూరు మండలంలో 15 ఐకేపీ కేంద్రాలు, పీఏసీఎస్ ద్వార ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా ధాన్యం తరలింపులో మాత్రం రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. అకాల వర్షాలు కురుస్తుండడంతో పంటను త్వరగా విక్రయించుకోవాలన్న రైతుల అత్రుతకు తోడు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సకాలంలో లారీలను అధికారులు తరలించకపోవడంతో ఈ సమస్య నెలకొంది.
ఒకే మిల్లుకు 60కి పైగా ట్రాక్టర్లలో ధాన్యం..
ఆదివా మద్దూరులోని పద్మావతి రైస్మిల్లుకు దాదాపు 60పైగా ట్రాక్టర్లలో రైతులు ధాన్యాన్ని తీసుకువెళ్లారు. దీంతో మిల్లులో స్థలం లేదని, కొన్ని మాత్రమే ఇక్కడ దించుకోవడం కుదురుతుందని రైస్ మిల్లు యజమాని రైతులకు సూచించారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్, సీపీఎం, రైతు సంఘాల నాయకలు అక్కడికి చేరుకొని ఆందోళన చేపట్టారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యం మొత్తం దించుకోవాల్సిందే అని, ఎన్నాళ్లు ఇలా ఎదురుచూడాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డీటీ ఆనంద్కుమార్ అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో 20 ట్రాక్టర్లు పద్మావతి రైస్మిల్లులో, మరో 20 ట్రాక్టర్లు లక్ష్మి వెంకటేశ్వర రైస్మిల్లుకు తరలించారు. మిగిలిన 38 ట్రాక్టర్లను కూడా ఇతర రైస్మిల్లులకు తరలిస్తామని హామీ ఇవ్వడంతో సమస్య సద్దుమణిగింది.
నేరుగా ట్రాక్టర్లపై ధాన్యాన్ని మిల్లులకు తరలించిన రైతులు
ధాన్యం దించేందుకు మిల్లర్ నిరాకరణ
రైతులు, బీఆర్ఎస్, ప్రజా సంఘాల నాయకుల ఆందోళన

ధాన్యం తరలింపులో గందరగోళం