
‘జై సంవిధాన్’ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
నారాయణపేట: జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి గ్రామంలో చేపట్టే పాదయాత్రలో నాయకులు, కార్యకర్తలు కదం తొక్కాలని టీపీసీసీ జనరల్ సెక్రెటరీ, జిల్లా ఇన్చార్జ్ ధారాసింగ్నాయక్ పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షుడు కె.ప్రశాంత్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన జై బాపు..జై భీమ్.. జై సమిధాన్ ఆల్ ఇండియన్ కాంగ్రెస్ జిల్లా స్థాయి సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మండల స్థాయి సన్నాహక సమావేశ ఏర్పాట్లు మండల స్థాయిలో జరిగేలా మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అధ్యక్షత వహించాలన్నారు. అలాగే గ్రామాల పాదయాత్ర జాబితా రూట్ ప్లాన్ ప్రోగ్రామ్స్ ప్రారంభం, ముగింపు తేదీలను ఖరారు చేయాలన్నారు. ఏ గ్రామంలో మొదలవుతుంది, ఎక్కడ ముగుస్తుంది అనే అంశాలపై ప్రతి ఒక్కరికి తెలియపరచాలన్నారు. మార్చి 28 కంటే ముందు పూర్తి చేయాలన్నారు. తదనుగుణంగా జిల్లా మండల స్థాయి ప్రణాళికబద్ధమైన సమావేశాలకు పీపీటీలను భాగస్వామ్యం చేయాలన్నారు. పాదయాత్రకు గ్రామంలోకి ప్రవేశించడానికి ఒక రోజు ముందు ప్రజలకు తెలియజేయడానికి, జనాన్ని సమీకరించడానికి డప్పు చాటింపు నిర్వహించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అనంతరం కాంగ్రెస్ శ్రేణులతో ప్రతిజ్ఞ చేయించారు. సమావేశంలో నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, మాజీ డీసీసీ అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ విజయ్ కుమార్, మహిళా అధ్యక్షురాలు ప్రసన్నా రెడ్డి ప్రతినిధులు పాల్గొన్నారు.