● సాత్వికబలిగా గుమ్మడికాయలు,
నిమ్మకాయలు, కొబ్బరికాయలు
● సీ్త్ర వేషంలో పురుషుడు అమ్మవారికి
కుంభహారతి
శ్రీశైలంటెంపుల్: లోక కల్యాణం కోసం శ్రీశైల శ్రీభ్రమరాంబాదేవికి మంగళవారం కుంభోత్సవం నిర్వహించనున్నారు. ఈ ఉత్సవంలో గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, అన్నపురాశి మొదలైనవి అమ్మవారికి సాత్వికబలిగా సమర్పిస్తారు. మంగళవారం ఉదయం ప్రాతఃకాల పూజల అనంతరం అమ్మవారికి ఆలయ అర్చకులు నవావరణ పూజ, త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తర శతనామ కుంకుమపూజలను, జపపారాయణలను నిర్వహిస్తారు. ఆచారాన్ని అనుసరించి ఈ పూజలన్నీ కూడా ఏకాంతంగా నిర్వహిస్తారు. తరువాత అమ్మవారి ఆల యం ముందు రజకునిచే ముగ్గు వేయించి, భ్రమ రాంబాదేవికి కొబ్బరికాయలు, నిమ్మకాయలు, గుమ్మడికాయలతో తొలి విడత సాత్వికబలి సమర్పిస్తారు. కుంభోత్సవంలో భాగంగానే హరిహరరాయ గోపురం వద్ద ఉన్న మహిషాసురమర్థిని అమ్మవారికి (కోటమ్మవారికి) ప్రత్యేక పూజాదికాలను జరిపించి సాత్వికబలిగా కొబ్బరికాయలను సమర్పిస్తారు. సాయంత్రం మల్లికార్జున స్వామివారికి ప్రదోషకాల పూజల అనంతరం అన్నాభిషేకం చేపడుతారు. ఆ సమయంలో ఆలయ ద్వారాలు మూసివేస్తారు. అనంతరం అమ్మవారి ఆలయానికి ఎదురుగా సింహ మండపం వద్ద వండిన అన్నం కుంభరాశిగా పోస్తారు. అనంతరం సంప్రదాయాన్ని అనుసరించి సీ్త్ర వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతిని సమర్పిస్తాడు. అనంతరం రెండో విడత సాత్వికబలిని సమర్పిస్తారు. తరువాత భక్తులను అమ్మ వారి దర్శనానికి అనుమతిస్తారు. అలాగే అమ్మవారికి ప్రత్యేక పూజలను చేసి తొమ్మిది రకాల పిండివంటలతో మహానివేదన చేస్తారు. కుంభోత్సవాన్ని పురస్కరించుకుని స్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవం, ఏకాంతసేవ, అన్ని ఆర్జిత సేవలను నిలుపుదల చేశారు.


