
సోయాబీన్ విత్తనాల కోసం రైతుల ఆందోళన
పాములపాడు: మిట్టకందల గ్రామ రైతు సేవా కేంద్రం వద్ద సోయాబీన్ విత్తనాల కోసం రైతులు ఆందోళనకు దిగారు. మనవూరు నేస్తాలు అనే సంస్థ ద్వారా మండలంలో సోయాబీన్ విత్తనాల పంపిణీ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతోంది. మండలానికి 112 క్వింటాళ్ల సోయాబీన్ విత్తనాలు మంజూరయ్యాయి. మంగళవారం సంస్థ సిబ్బంది వెంకటరాముడు సుమారు 50 ప్యాకెట్లు గ్రామంలోని ఆర్ఎస్కేలో నిల్వ చేశారు. కాగా మండలంలో అధికంగా సాగయ్యే వాడా ల, మద్దూరు గ్రామాల్లో ప్రధానంగా పంపిణీ చేయాల్సి ఉందని వ్యవసాయ శాఖ సిబ్బంది పేర్కొ న్నారు. దీంతో ఆ విత్తనాలను మరో గ్రామానికి తరలించేందుకు సిద్ధం చేస్తుండగా మిట్టకందాల రైతు లు అడ్డుకున్నారు. తమ గ్రామానికి వచ్చిన విత్తనాలను పక్క గ్రామాలకు ఎలా తరలిస్తారని, స్థానిక రైతులకే పంపిణీ చేయాలని ఆందోళనకు దిగారు. ఈ విషయంపై మండల వ్యవసాయ అధికారి మహేశ్వర్ రెడ్డిని వివరణ కోరగా మిట్టకందాల గ్రామంలో కేవలం 40 ఎకరాల్లో మాత్రమే సోయాబీన్ సాగు చేస్తారని, దీంతో ఆ గ్రామానికి ఆరు క్వింటాళ్లు కేటాయిస్తామని రైతులకు చెప్పామని తెలిపారు. సాగు చేస్తున్న ప్రాంతాలను బట్టి పంపిణీ చేస్తామని చెప్పారు. గోదాములు లేకనే ఆ గ్రామంలో స్టాక్ పాయింట్ ఏర్పాటు చేశామని, ప్రభుత్వం మంజూరు చేసిన మేరకు రైతులకు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు.