మల్లన్న ఉచిత స్పర్శ దర్శనానికి టోకెన్‌ విధానం | - | Sakshi
Sakshi News home page

మల్లన్న ఉచిత స్పర్శ దర్శనానికి టోకెన్‌ విధానం

Jun 25 2025 7:04 AM | Updated on Jun 25 2025 7:04 AM

మల్లన్న ఉచిత స్పర్శ   దర్శనానికి టోకెన్‌ విధానం

మల్లన్న ఉచిత స్పర్శ దర్శనానికి టోకెన్‌ విధానం

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల మల్లన్న ఉచిత స్పర్శ దర్శనంలో పారదర్శకత కోసం కొత్తగా టోకెన్‌ విధానాన్ని ప్రవేశపెడుతున్నామని, ఏరోజుకారోజు కౌంటర్ల ద్వారా టోకెన్లను జారీ చేస్తామని శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ జూలై 1వ తేదీ నుంచి ప్రతి మంగళవారం నుంచి శుక్రవారం వరకు మల్లన్న ఉచిత స్పర్శదర్శనాన్ని పునఃప్రారంభిస్తున్నామని తెలిపారు. కంప్యూటరైజ్‌ టోకెన్లలో భక్తుని పేరు, ఆధార్‌, ఫోన్‌ నెంబరును నమోదు చేస్తామని, ఈ టోకెన్లను ఉచిత దర్శనం క్యూలైన్‌ ప్రవేశద్వారం వద్ద ఉన్న స్కానింగ్‌ ద్వారా తనిఖీ చేసి భక్తులను ఉచిత స్పర్శదర్శనానికి అనుమతిస్తామని పేర్కొన్నారు. అవకాశాన్ని బట్టి రోజుకు 1,000 నుంచి 1,200 టోకెన్లను జారీ చేస్తామని, ఉచిత టోకెన్లు కలిగిన భక్తులను మాత్రమే అనుమతిస్తామని వివరించారు. స్పర్శదర్శనానికి వచ్చే పురుషులు సంప్రదాయ దుస్తులు తెల్ల పంచె, మెడలో తెల్లకండువా, మహిళలు చీర, రవిక, చున్నీతో కూడిన సల్వార్‌ కమీజ్‌లను ధరించాల్సి ఉంటుందని సూచించారు.

పడిపోయిన కందులు, వాము ధరలు

కర్నూలు(అగ్రికల్చర్‌): కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో కందులు, వాము ధరలు పడిపోయాయి. మంగళవారం మార్కెట్‌కు వాము 182 క్వింటాళ్లు, కందులు 457 క్వింటాళ్లు వచ్చాయి.వాము క్వింటాకు కనిష్టంగా రూ.1, 550,గరిష్టంగా రూ.21,412 లభించింది. సగటు ధర రూ.16,850 నమోదైంది. కందుల ధర రైతులను నిరాశకు గురి చేస్తోంది. కనిష్ట ధర రూ.4,089, గరిష్ట ధర రూ.6,769 మాత్రమే ల భించగా.. సగటు ధర రూ.6,629 పలికింది. వ్యాపారులు సిండికేట్‌ కావడం వల్ల వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు నిరాశజనకంగా లభిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

గాలులతో కూడిన తేలికపాటి వర్షాలే!

కర్నూలు(అగ్రికల్చర్‌): రానున్న ఐదు రోజుల పాటు ఉమ్మడి జిల్లాలో గాలుల తీవ్రతే కొనసాగనుంది. ఈ నెల 25న ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. బలమైన గాలు లు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 26 నుంచి గాలుల తీవ్రతతో పాటు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులను వర్షాలు నిరాశకు గురి చేస్తున్నాయి. కాగా సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు ఏడు మండలా ల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. వెల్దుర్తిలో 4.2 మి.మీ, హొళగుందలో 3.2, మద్దికెరలో 2.8, ఓ ర్వకల్‌లో 1.2, గోనెగండ్లలో 1.2, ఆదోనిలో 1.2, క్రిష్ణగిరిలో 1.2 మి.మీ వర్షపాతం నమోదైంది.

858.60 అడుగులుగా శ్రీశైలం డ్యాం నీటిమట్టం

శ్రీశైలంప్రాజెక్ట్‌: శ్రీశైలం డ్యాం నీటిమట్టం మంగళవారం సాయంత్రానికి 858.60 అడుగులకు చేరుకుంది. ఎగువ జూరాలలో స్పిల్‌వే ద్వారా విద్యుత్‌ ఉత్పాదన అనంతరం సోమవారం నుంచి మంగళవారం వరకు 46,495 క్యూసెక్కుల వరద నీటిని శ్రీశైలంకు విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయంలో 101.6785 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement