
తప్పుల్లేని ఓటర్ల జాబితాకు సహకరించండి
నంద్యాల: తప్పుల్లేని ఓటర్ల జాబితాకు రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్ అన్నారు. బుధవారం జిల్లా రెవెన్యూ అధికారి చాంబర్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో డీఆర్ఓ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటర్ల జాబితాలోని మృతులు తొలగింపు, మార్పులు, చేర్పులను బూతు స్థాయి ఏజెంట్లతో పరిశీలించుకుని అభ్యంతరాలు ఉంటే సంబంధి త అధికారులకు తెలియజేయాలన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ.. హోమ్ ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. గిరిజనలు, చెంచు జనాభా ఎక్కువగా ప్రాంతాల్లో వారికి ఓటింగ్పై చైతన్యం కల్పించాలని కోరారు. సమావేశంలో ఎన్నిక విభాగ సూపరింటెండెంట్ జయప్రసాద్, ఇన్చార్జ్ ఏఓ సుభాకర్, వైఎస్సార్సీపీ ప్రతినిధి సాయిరాంరెడ్డి, బీఎస్పీ పార్టీ ప్రతినిధి కొట్టం శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి సయ్యద్ రియాజ్ బాషా, టీడీపీ ప్రతినిధి కె.శివరాంరెడ్డి పాల్గొన్నారు.