
జీఓ నెం.5ను సవరించాలి
కొలిమిగుండ్ల: సచివాలయ ఉద్యోగుల బదిలీల నేపథ్యంలో ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్ 5ను తక్షణమే సవరించాలని గ్రామ సచివాలయ ఉద్యోగులు నిరసన బాట పట్టారు. మంగళవారం వివిధ గ్రామాల సచివాలయాల ఉద్యోగులు ప్లకార్డులు చేతపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈఓఆర్డీ చంద్రమౌళీశ్వరగౌడ్, తహసీల్దార్ శ్రీనివాసులకు వినతి పత్రాలు అందజేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. వార్డు సచివాలయ ఉద్యోగులకు వార్డు స్థాయిలోనే బదిలీలకు అవకాశం కల్పించి, గ్రామ సచివాలయ ఉద్యోగులకు ఎందుకు సడలింపు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇతర మండలాల్లో పోస్టింగ్ ఇస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాపోయారు. రేషనలైజేషన్లో మిగులు ఉద్యోగులును ఎలా ఉపయోగిస్తారు తెలియని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. సీనియార్టీ, రోస్టర్ జాబితా ప్రకారం పదోన్నతులు కల్పించిన అనంతరమే బదిలీలు చేపట్టాలని కోరారు. రికార్డు స్థాయి స్థాయి ఉద్యోగులకు గెజిటెడ్ ఉద్యోగుల స్థాయి నిబంధనలు విధించడం సరికాదన్నారు. సొంత మండలాల్లోనే బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు.