
12, 13 తేదీల్లో తెలుగు భాషా పరిరక్షణ సదస్సు
కర్నూలు కల్చరల్: రాష్ట్రస్థాయి తెలుగు భాషా పరిరక్షణ సదస్సును జులై 12, 13 తేదీల్లో కర్నూలు సీక్యాంప్ టీజీవీ కళాక్షేత్రంలో నిర్వహించనున్నట్లు సదస్సు కన్వీనర్ పత్తి ఓబులయ్య తెలిపారు. సోమవారం కళాక్షేత్రంలో సదస్సుకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు భాష పరిరక్షణకు ఒక వేదికను ఏర్పాటు చేసి రాష్ట్రస్థాయి సదస్సును ఏర్పాటు చేస్తున్నామన్నారు. సదస్సు అధ్యక్ష ఉపాధ్యక్షులు చంద్రశేఖర కల్కూర, జేఎస్ ఆర్కే శర్మ మాట్లాడుతూ.. రెండు రోజుల పాటు జరిగే సదస్సులో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు పాల్గొంటారన్నారు. మొదటి రోజు కొండారెడ్డి బురుజు సమీపంలోని తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి సదస్సు జరిగే వేదిక వరకు పాదయాత్ర జరుగుతుందన్నారు. రెండో రోజు జరిగే సదస్సులో బోధనా భాషగా తెలుగు, మాతృ భాషగా తెలుగు, అధికార భాషగా తెలుగు, ప్రథమ భాషగా తెలుగు అనే అంశాలపై చర్చించడం జరుగుతుందన్నారు. శాసన సభ్యులు మండలి బుద్ధప్రసాద్, విశ్రాంత ఐఏఎస్ ముక్తేశ్వరరావు, తమిళనాడు రాష్ట్రం తెలుగు భాషా సంఘం అధ్యక్షుడు తూమాటి సంజీవరావు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత రాజపాళెం చంద్రశేఖర రెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేష్, మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం పాల్గొని సందేశమిస్తారన్నారు. తెలుగు భాషాభివృద్ధిపై కవి సమ్మేళనం, పేపర్ ప్రజెంటేషన్ ఉంటుందన్నారు. సాహిత్యాభిమానులు, తెలుగు భాషాభిమానులందరూ సదస్సులో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సదస్సు కార్యదర్శి డాక్టర్ దండెబోయిన పార్వతీ దేవి, సభ్యులు సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు.