
వ్యవసాయంలో పెట్టుబడులు తగ్గి, దిగుబడులు పెరగాలంటే భూసార
● ఖరీఫ్ మొదలైనా ఊసేలేని
భూసార పరీక్షలు
● ఇష్టారాజ్యంగా మట్టి నమూనాల
సేకరణ
● విద్యుత్ సరఫరా లేని
ఎమ్మిగనూరు పరీక్ష కేంద్రం
● గతేడాది కెమికల్స్ నిధులు స్వాహా
ఎమ్మిగనూరు భూసార పరీక్ష కేంద్రానికి
గత ఏడాది వచ్చిన మట్టి నమూనాలు (ఫైల్)
కర్నూలు(అగ్రికల్చర్): రైతులకు భూసార పరీక్ష వివరాలు అందితే సాగు ఖర్చు తగ్గించుకోవడంతో పాటు అధిక దిగుబడులు సాధించుకునే అవకాశం కలుగుతుంది. ఈ ఏడాది ఉమ్మడి కర్నూలు జిల్లాలో 49 వేల భూసార పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కాని ఇంతవరకు మట్టి నమూనాల సేకరణ, రైతుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయడం మినహా ఇతరత్రా ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు.
20 రోజులు గడిచినప్పటికీ...
భూసార పరీక్షల్లో ఉదజని సూచిక, స్థూల పోషకాలైన భాస్వరం, నత్రజని, పోటాష్తో పాటు సూక్ష్మ పోషకాలైన జింక్, కాల్షియం, క్లోరిన్, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, సల్ఫర్, కాపర్, మాలిబ్డినం తదితర 15 పరీక్షలు నిర్వహిస్తారు. ఉద్దేశం మంచిదే అయినప్పటికి భూసార పరీక్షల నిర్వహణలో చిత్తశద్ధి లోపించడం రైతుల పాలిట శాపంగా మారింది. ఉమ్మడి జిల్లాలో 877 రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో దాని నుంచి 55 మట్టి నమూనాలు సేకరించాల్సి ఉంది. వాటి ఇన్చార్జ్లు మట్టి నమూనాలు సేకరించి.. వాటి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాత మట్టి నమూనాలను సంబందిత భూ సార పరీక్ష కేంద్రాలకు తరలిస్తారు. ఖరీఫ్ సీజన్ మొదలై 20 రోజులు గడచినప్పటికీ మట్టి నమూనాల సేకరణనే పూర్తి కాలేదు. భూసార పరీక్షల నిర్వహణ కు ప్రభుత్వం ఒక్క రూపాయి విదిల్చలేదు. కెమికల్స్ లేవు.. ఇన్ని సమస్యల మధ్య భూసార పరీక్ష ఫలితాలు ఎప్పడు ఇస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.
పరీక్షలకు ‘విద్యుత్’ షాక్
ఎమ్మిగనూరు భూసార పరీక్ష కేంద్రంలో ఏడీఏ పోస్టుతో పాటు నాలుగు ఏవో పోస్టులు ఉన్నాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా వైరింగ్ మొత్తం కాలిపోయి ఈ కేంద్రానికి నాలుగు నెలల నుంచి కరెంటు లేదు. విద్యుత్ ప్రమాదానికి బిల్డింగ్ కూడా దెబ్బతినింది. భవనానికి పూర్తి స్థాయిలో వైరింగ్ పనులు చేపట్టాల్సి ఉంది. ఇందుకు రూ.4.60 లక్షలతో ప్రతిపాదనలు పంపినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకోలేదు. కరెంట్ లేకపోవడంతో భూసార పరీక్షల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది.
ప్రహసనం
మట్టి నమూనాల సేకరణకు స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. ఈ ప్రకారమే సేకరించాల్సి ఉంది. గ్యాప్ పొలంబడి నిర్వహించే ప్రాంతాలు, ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలు, ఆయిల్ సీడ్స్ ప్రదర్శనా క్షేత్రాలు..తదితర ప్రాంతాల్లోనే మట్టి నమూనాలు సేకరించాల్సి ఉంది. 2024–25లో మార్గదర్శకాలను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా సేకరించి మమ అనిపించారు. దీంతో భూసార పరీక్షలకు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోయింది. ఈ ఏడాది ఆన్లైన్లోనే మట్టి నమనాలు సేకరించాల్సి ఉంది. ఈ సారి కూడా మట్టి నమూనాల సేకరణ ప్రహసనంగా మారింది. మార్గదర్శకాలకు విరుద్ధంగా మట్టి నమూనాలు సేకరిస్తుండటంతో భూసార పరీక్షల్లో పారదర్శకత లేకుండా పోయింది.
నిధులు స్వాహా
భూసార పరీక్షల్లో నాణ్యత ఉండాలంటే తగిన మోతాదులో రసాయనాలు వినియోగించాల్సి ఉంది. గత ఏడాది భూసార పరీక్షలకు అవసరమైన రసాయనాల కొనుగోలు చేసేందుకు విడుదల చేసిన రూ.15 లక్షలు స్వాహా అయ్యాయి. ఈ ఏడాది ఒక్క రూపాయి విడుదల కాలేదు. రసాయనాలు లేవు. గతంలో 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం భూసార పరీక్షలంటూ హంగామా చేసిందే తప్ప.. ఫలితాలను రైతులకు ఇవ్వలేదు. ఇదే పరిస్థితి 2024–25లో కూడా పునరావృతం అయ్యింది. 2025–26లో భూసార పరీక్షల నిర్వహణ మరింత అస్తవ్యస్తం అయిందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఇవీ సమస్యలు
● ఎమ్మిగనూరు భూసార పరీక్ష కేంద్రంలో12,971 మట్టి నమూనాలను పరీక్షించాల్సి ఉంది. రైతుసేవా కేంద్రాల నుంచి ఒక్క మట్టి నమూనా కూడా ఇక్కడికి చేరలేదు. కరెంటు లేకపోవడంతో భూసార పరీక్షల నిర్వహణకు గ్రహణం పట్టింది.
● కర్నూలు మార్కెట్ యార్డులోని సాయిల్ టెస్టింగ్ ల్యాబ్లో 12,971 మట్టి నమూనాలను పరీక్షించాల్సి ఉంది. ఈ ల్యాబ్కు రైతు సేవా కేంద్రాల నుంచి 1,430 మట్టి నమూనాలు చేరాయి. అయితే శాసీ్త్రయంగా పరీక్షించేందుకు కెమికల్స్ లేపోవడంతో ఇంతవరకు భూసార పరీక్షలు చేపట్టిన దాఖలాలు లేవు.
● నంద్యాల జిల్లాకు సంబంధించి ఇంతవరకు భూసార పరీక్షల నిర్వహణ అతీగతీ లేకుండా పోయింది. ఈ జిల్లాలో 411 రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. ప్రతి కేంద్రం నుంచి 55 మట్టి నమూనాలు సేకరించాల్సి ఉంది. ఈ ప్రకారం 22,605 మట్టి నమూనాలు సేకరించి.. ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాత ల్యాబ్కు పంపాల్సి ఉంది. ఇంతవరకు నంద్యాల ల్యాబ్కు ఒక్క మట్టి నమూనా కూడా రాలేదు.
చర్యలు తీసుకుంటున్నాం
ఈ ఏడాది జిల్లాలో 25 వేలకుపైగా భూసార పరీక్షలు చేపట్టేందుకు వ్యవసాయ శాఖ ఆదేశాలు ఇచ్చింది. ఒక్కో రైతుసేవా కేంద్రం పరిధిలో 55 మట్టి నమూనాలు సేకరించే విధంగా లక్ష్యాలు ఇచ్చాం. ప్రస్తుతం రైతుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఆన్లైన్ చేసిన తర్వాత మట్టి నమూనాలు ల్యాబ్లకు వస్తాయి. కర్నూలులో సగం, ఎమ్మిగనూరు ల్యాబ్ల్లో సగం ప్రకారం మట్టి నమూనాలకు పరీక్షలు నిర్వహిస్తారు. రైతులకు త్వరగా భూసార పరీక్షల ఫలితాలు అందచేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. – పీఎల్ వరలక్ష్మి,
జిల్లా వ్యవసాయ అధికారి, కర్నూలు
ఇవీ భూసార పరీక్ష
కేంద్రాలు..
కర్నూలు జిల్లాకు సంబందించి కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో భూసార పరీక్ష కేంద్రం ఉంది. అలాగే ఎమ్మిగనూరులోని భూసార పరీక్ష కేంద్రాల్లో మట్టి నమూనాలను పరీక్షిస్తారు.
నంద్యాల జిల్లాకు సంబంధించి నంద్యాలలోని భూసార పరీక్ష కేంద్రంలో పరీక్షలు నిర్వహిస్తారు.

వ్యవసాయంలో పెట్టుబడులు తగ్గి, దిగుబడులు పెరగాలంటే భూసార

వ్యవసాయంలో పెట్టుబడులు తగ్గి, దిగుబడులు పెరగాలంటే భూసార