
శ్రీశైలంలో భక్తుల రద్దీ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి ఆదివారం భక్తులు రద్దీ కొనసాగింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు మల్లన్న దర్శనానికి భారీగా తరలివచ్చారు. వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లికార్జునస్వామివారి దర్శనానికి క్యూలైన్ వద్దకు చేరుకున్నారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు.
నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
నంద్యాల:స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1100ను సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దర ఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam. ap.gov.in వెబ్సైట్లో తెలుసుకోవడంతో పాటు తమ అర్జీలను కూడా నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.
నేటి పీజీఆర్ఎస్ రద్దు
బొమ్మలసత్రం: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఎస్పీ అధిరాజ్సింగ్రాణా ఆది వారం ప్రకటనలో పేర్కొన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేశామని, ఈనెల 30న సోమవారం యథావిధిగా నిర్వహిస్తున్నామన్నారు.
ప్రశాంతంగా డీఎస్సీ పరీక్షలు
నంద్యాల(న్యూటౌన్): జిల్లాలోని ఐదు పరీక్ష కేంద్రాల్లో ఆదివారం తెలుగు, పీఈటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు డీఈఓ జనార్ధన్రెడ్డి ఆదివారం తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షకు 790 మందికి గాను 748 మంది అభ్యర్థులు హాజరు కాగా, 42 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. అలాగే మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 742 మందికి గాను 565 మంది అభ్యర్థులు హాజరు కాగా 177 మంది గైర్హాజరైనట్లు తెలిపారు.
ఉత్తమ జీవనానికి సోపానాలు ఇతిహాసాలు
కర్నూలు కల్చరల్: ఉత్తమ జీవనానికి భారత, భాగవత, రామాయణ ఇతిహాసాలు సోపానా లుగా నిలుస్తాయని ఇస్కాన్ ధర్మ ప్రచారకులు గంగావతి హరిదాస్ అన్నారు. ఆదివారం స్థానిక భగీరథ కాంప్లెక్స్లోని పూరి జగన్నాథ మందిరంలో యోగిని ఏకాదశి వేడుకలు, భగవద్గీత తరగతులు, శీల ప్రభుపాదుల ప్రేమ విందు కార్యక్రమాలు జరిగాయి. జగన్నాథ్, సుభద్ర, బలదేవ్లను ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం వైష్ణోకృప చైతన్య ప్రభు సందేశమిస్తూ భగవద్గీత పఠనం, శ్రవణంతో మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు.