
కౌన్సెలింగ్ ఆలస్యం.. అస్తవ్యస్తం
కర్నూలు సిటీ: ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న మినిమం టైం స్కేల్ (ఎంటీఎస్) టీచర్లకు ఇటీవలే కూటమి ప్రభుత్వం రెన్యూవల్ చేసింది. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు పూర్తి కావడంతో మిగిలిన ఖాళీల్లో 1998 డీఎస్సీ, 2008 డీఎస్సీలకు చెందిన మినిమం టైం స్కేల్ టీచర్లను నియమించేందుకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆదివారం ఉమ్మడి జిల్లాలోని ఎంటీఎస్ టీచర్లకు స్థానాలు కేటాయించేందుకు కర్నూలు సమగ్ర శిక్ష కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు కాకుండా ఆలస్యంగా కౌన్సెలింగ్ నిర్వహించారు. అయితే 1998 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్లు, 2008 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్ల మధ్య సీనియారిటీ విషయంలో వాగ్వాదం జరిగింది. విద్యాశాఖ అధికారులు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహి స్తామని చెప్పినా వివాదం సమసిపోలేదు. దీంతో విద్యాశాఖ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు కౌన్సెలింగ్ కేంద్రం దగ్గరకు వచ్చి అధికారులు పిలిచిన వారిని మాత్రమే హాల్లో అనుమతించారు. మిగిలిన వారిని బయటకు పంపించారు. ఆ తరువాత కౌన్సెలింగ్ మొదలైంది. ముందుగా ఉర్దూ, కన్నడ మీడియం టీచర్లకు స్కూళ్లను కేటాయించారు. కౌన్సెలింగ్ ఆలస్యం కావడం..వర్షం రావడంతో ఎంటీఎస్ టీచర్లు ఇబ్బందులు పడ్డారు.
ఉమ్మడి జిల్లాలో 3,296 ఖాళీలను
చూపిన విద్యాశాఖ
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తి కావడంతో ఇక మిగిలిన ఖాళీలలో ఎంటీఎస్ టీచర్లను నియమించేందుకు విద్యాశాఖ ఉమ్మడి జిల్లాలో 3296 టీచర్ పోస్టుల ఖాళీలను చూపించారు. అయితే ఇందులో పశ్చిమ ప్రాంతంలోని స్కూళ్లలోనే అధిక శాతం ఖాళీలు ఉన్నాయి. 1998, 2008 డీఎస్సీలకు చెందిన ఎంటీఎస్ టీచర్లు ఉమ్మడి జిల్లాలో 353 మంది ఉన్నారు. వీరందరికీ జాబితాలో ఉండే సీరియల్ నంబరు ఆధారంగా ఆయా మండలాల్లోని ఖాళీలను చూపించి స్కూళ్లను కేటాయించారు. ఎంటీఎస్ టీచర్లను నియమించినా కూడా ఇంకా జిల్లాలో 2, 943 టీచర్ పోస్టులు ఖాళీగా ఉండనున్నాయి. ఇందులో 2024 డీఎస్సీ ఎస్జీటీ తెలుగు మీడియం 1,671, కన్నడ మీడియం 28 పోస్టులు, ఉర్దూ మీడియం పోస్టులు 118 పోయినా 1,126 టీచర్ పోస్టులు జిల్లాలో ఖాళీగా ఉండనున్నాయి.
ఎంటీఎస్ టీచర్ల మధ్య వాగ్వాదం

కౌన్సెలింగ్ ఆలస్యం.. అస్తవ్యస్తం