
లంచగొండి పోలీసులకు రిమాండ్
కర్నూలు: రూ.80 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన నాలుగో పట్టణ సీఐ మధుసూదన్ గౌడ్, హెడ్ కానిస్టేబుల్ రవికుమార్లను రిమాండ్కు ఆదేశిస్తూ రాయలసీమ జిల్లాల ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎన్.శ్రీవిద్య సోమవారం తీర్పు చెప్పారు. సీఐ మధుసూదన్ గౌడ్ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ రవికుమార్ దాడి కేసులో నిందితుడు బెస్త రవి నుంచి కొత్తబస్టాండ్ ఎదురుగా ఉన్న నిర్మల్ హోటల్లో రూ.80 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సీఐ, హెడ్ కానిస్టేబుల్ ఇళ్లలో ఏసీబీ బృందాలు సోదాలు నిర్వహించారు. సీఐ ఇంట్లో భారీగా బంగారు నగలు, స్థిరాస్తి పత్రాలు బయట పడినట్లు తెలిసింది. తనిఖీల అనంతరం పంచనామా పూర్తి చేసి మున్సిఫ్ కోర్టు ఆవరణలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్కు ఆదేశించారు. ఇదిలాఉంటే ఎస్పీ విక్రాంత్ పాటిల్ సిఫారసు మేరకు సీఐ మధుసూదన్ గౌడ్, హెడ్ కానిస్టేబుల్ రవికుమార్లను సస్పెండ్ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
కేసు నీరుగార్చేందుకు ఒత్తిళ్లు
సీఐ మధుసూదన్ గౌడ్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ మంత్రికి బాగా కావలసిన అధికారి. ఈ నేపథ్యంలో కేసు తీవ్రతను తగ్గించి మాధ్యమాల్లో ప్రచారం కాకుండా తీవ్ర ఒత్తిడి చేసినట్లు పోలీసు శాఖలో చర్చ జరుగుతోంది. సీఐ గత ఏడాది ఆగస్టులో నాలుగో పట్టణ సీఐగా బాధ్యతలు చేపట్టారు. పోస్టింగ్ కోసం అధికార పార్టీకి చెందిన ముగ్గురు నేతలకు ముడుపులు ముట్టజెప్పి వచ్చినట్లు సమాచారం. దీంతో ఈయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పాత కేసులను కూడా తిరగదోడి డబ్బులు దండుకున్నట్లు స్టేషన్లో పనిచేసే ఉద్యోగులే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. సీఐ పోస్టు ఖాళీ కావడంతో పలువురు పోస్టింగ్ కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్లు పోలీసు శాఖలో చర్చ జరుగుతోంది. ప్రత్యేక విభాగంలో పనిచేస్తున్న ఓ అధికారి, నంద్యాలకు సమీపంలోని సర్కిల్లో పనిచేస్తున్న మరో సీఐ, గతంలో కర్నూలు అర్బన్ తాలూకాలో పనిచేసి బదిలీపై వెళ్లి వీఆర్లో ఉన్న మరో సీఐ ఈ సర్కిల్ పోస్టింగ్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.
తీర్పు చెప్పిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి