
ప్రజలను అప్రమత్తం చేయాలి
బొమ్మలసత్రం: భారీ వర్షాలు, ఈదురు గాలులు వీచే సమయంలో ప్రజలు స్తంభాలు, చెట్ల కింద ఉండకుండా అప్రమత్తం చేయాలని పోలీస్ అధికారులకు ఎస్పీ అధిరాజ్సింగ్రాణా సూచించారు. బుధవారం తన కార్యలయంలో ఆయన మాట్లాడారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉన్న వారు వర్షం పడే సమయంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన విజిబుల్ పోలీసింగ్లో భాగంగా బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న 94 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
శ్రీశైలంలో తొట్టెల నిర్మాణం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలోని పైకప్పుల నుంచి లీకేజీ అరికట్టేందుకు దేవస్థానం చర్యలకు ఉపక్రమించింది. ఇందుకోసం సున్నపు, జాజికాయ, బెల్లం తదితర వస్తువుల మిశ్రమాన్ని కలుపుకునేందుకు ఆలయంలో పలు ప్రదేశాలలో తొట్టెల నిర్మాణం చేపడుతున్నారు. పూణేలోని ఉత్తరాదేవి చారిటబుల్ట్రస్ట్ వారితో పురాతన పరిరక్షణ పద్ధతులను అనుసరించి ఆలయంలో పైకప్పుల నుంచి లీకేజీని అరికట్టే పనులు చేపడుతున్నారు. దేవాలయాల ప్రాంగణంలో పరిరక్షణ పనులు చేపట్టడం శుభపరిణామమని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ ఆర్.చంద్రశేఖరరెడ్డి తెలిపారు. గతంలో (1965–70, 2013–14 సంవత్సరాల్లో) శ్రీశైల ఆలయంలో స్థానభ్రంశం చెందిన నిర్మాణాలను యథాతధం చేసిన తరువాత పరిరక్షణ పనులు చేపట్టాలని కోరారు.
మందులపై తప్పుడు ప్రకటనలు ఇస్తే చర్యలు
● ఔషధ నియంత్రణ శాఖ ఏడీ రమాదేవి
కర్నూలు(హాస్పిటల్): ప్రజలను తప్పుదోవ పట్టించేలా మందుల వినియోగంపై ప్రకటనలు ఇస్తే చర్యలు తీసుకుంటామని ఔషధ నియంత్రణ శాఖ ఏడీ రమాదేవి హెచ్చరించారు. బుధవారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ అధిక బరువు తగ్గిస్తామని, పలు రకాల వ్యాధులు నయం చేస్తామని సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చిన పలు సంస్థలపై ఇటీవల కేసులు నమోదు చేశామన్నారు. అందులో ఇండోర్కు చెందిన ఈమాన్ డ్రగ్స్, నందికొట్కూరుకు చెందిన వెంకటేశ్వరరెడ్డి, బనగానపల్లి మండలం బానుముక్కల గ్రామంలోని పక్షవాత నివారణ కేంద్రాలపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. కర్నూలు నగరంలోని గణేష్నగర్ సమీపంలోని పార్థగ్రాండ్లో ఫిజీషియన్ శాంపిల్స్ అక్రమంగా నిల్వ ఉంచుకున్న ఉదయ్కుమార్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశామన్నారు. ఇతనిపై ఇప్పటికే పలుమార్లు కేసులు ఉన్నట్లు తెలిపారు. అలాగే నంద్యాలలో శ్రీ వైష్ణవి మెడికల్స్పై డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి మత్తును కలిగించే మందులను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశామన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
కర్నూలు(అర్బన్): సీ క్యాంప్లోని ప్రభుత్వ శారీరక వికలాంగుల వసతి గృహంలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయో వృద్దుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిస్ఫాతిమా కోరారు. హాస్టల్లో 3వ తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇతర కోర్సులు చదివే విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తామని పేర్కొన్నారు. నిబంధనల మేరకు వంద మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తామని ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు కార్యాలయ ఫోన్ నంబర్ 08518–277864ను సంప్రదించాలన్నారు.
ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు ప్రారంభం
కర్నూలు సిటీ: ఏపీ ఈఏపీ సెట్లో ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. కర్నూలులో ఏర్పాటు చేసిన తొమ్మిది కేంద్రాల్లో మొదటి రోజున ఉదయం 1,247 మందికి గాను 1,177 మంది, మధ్యాహ్న సెషన్లో 1,255 మందికి గాను 1,182 మంది హాజరయ్యారు. నంద్యాలలోని మూడు కేంద్రాల్లో మొదటి రోజు ఉదయం 544 మందికి గానూ 520 మంది, మధ్యాహ్నం 543 మందికి గానూ 523 మంది హాజరయ్యారు. ఈ నెల 27వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.

ప్రజలను అప్రమత్తం చేయాలి