
నంద్యాలలో నాలుగు ‘నీట్’ కేంద్రాలు
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల న్యూటౌన్: మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈనెల 4వ తేదీన నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్టు (నీట్) కోసం నంద్యాలలో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. జిల్లాలో ప్రథమంగా ‘నీట్’ నిర్వహిస్తున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం చీఫ్ సూపరింటెండెంట్ల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నంద్యాల బస్టాండ్ సమీపంలో ఉన్న గవర్నమెంట్ హైస్కూల్, టెక్కె జూనియర్ కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ‘నీట్’ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మొత్తం 1,172 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారన్నారు. మధ్యాహ్నం 1.30 గంటల తరువాత విద్యార్థులకు పరీక్ష కేంద్రంలోకి అనుమతి లేదన్నారు. దివ్యాంగ విద్యార్థులకు ప్రతి పరీక్ష కేంద్రంలో రెండు వీల్ చైర్లను ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రాన్రిక్ పరికరాలను అనుమతించకూడదన్నారు. నంద్యాల పట్టణంలో విద్యార్థులకు ట్రాఫిక్తో సమస్య లేకుండా చూడాలన్నారు. ‘నీట్’పై పాటించాల్సిన నియమ నిబంధనలపై జిల్లా కోఆర్డినేటర్ సత్యనారాయణ పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో చీఫ్ సూపరింటెండెంట్లకు వివరించారు. నీట్ పరీక్షల సిటీ కోఆర్డినేటర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.