
డీజిల్ దొంగలు దొరికారు
● 11 మంది అరెస్ట్..
మరో ముగ్గురు పరారీ
● రూ.10.35 లక్షల నగదు,
350 లీటర్ల డీజిల్,
నాలుగు వాహనాలు స్వాధీనం
● ముఠా సభ్యులంతా
తెలంగాణ వాసులే
ఆదోని అర్బన్: గత ఎనిమిదేళ్ల నుంచి డీజిల్ చోరీని వృత్తిగా ఎంచుకున్న ముఠా సభ్యులు ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డారు. బుధవారం సిరుగుప్ప చెక్ పోస్టు వద్ద అనుమానాస్పదంగా ఉన్న 11 మంది దొంగలను ఆదోని వన్టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా డీజిల్ దొంగలుగా తేలింది. ఈ మేరకు ఆదోని డీఎస్పీ హేమలత, ఆదోని వన్టౌన్ సీఐ శ్రీరామ్ మీడియా ఎదుట నిందితులను హాజరుపరిచారు.. తెలంగాణ రాష్ట్రం నారాయణ పేట ప్రాంతానికి చెందిన రమేష్నాయక్ అలియాస్ చోటా నాయక్, పాండు నాయక్, పాపా నాయక్, రవి నాయక్, మహేష్ నాయక్, కిషన్ నాయక్, పాల్తియారవి నాయక్ అలియాస్ బిల్లా రవి, సభావత్ రవి నాయక్, చావన్సురేష్ నాయక్ అలియాస్ దేశముదురు, వర్త కిషన్ నాయక్, రవికుమార్ రాథోడ్లు కలిసి డీజిల్ చోరీని వృత్తిగా ఎంచుకున్నారు. దొంగలించిన డీజిల్ను ఇతర ప్రాంతాల్లో విక్రయించగా వచ్చిన డబ్బుతో జల్సాలకు పాల్పడేవారు. డీజిల్ చోరీకి నాలుగు వాహనాలను వినియోగిస్తూ ఎక్కడైనా పార్కింగ్లో లారీలను ఆపిన చోటుకు వాహనాల్లో వెళ్లి డీజిల్ దొంగతనం చేసి కార్లలో తరలించేవారు. ఇలా మొత్తం డీజిల్ దొంగతనంలో 10,620 లీటర్లు దొంగతనం చేసినట్లు విచారణలో తేలింది. గత నెల మార్చి 11వ తేదీన సర్దార్బాషా, ఈనెల 8వ తేదీన మైల రామకృష్ణ, సయ్యద్సమీర్ వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశామన్నారు. నెల రోజులుగా ఈ ముఠాను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామన్నారు. బుధవారం అందిన సమాచారం మేరకు సీఐ శ్రీరామ్, సిబ్బందితో కలిసి స్థానిక సిరుగుప్ప చెక్పోస్టు వద్ద 11 మందిని అరెస్టు చేశారని తెలిపారు. వారి నుంచి రూ.10,30,140 నగదు, 350 లీటర్ల డీజిల్, నాలుగు వాహనాలు (కార్లు), 10 ఖాళీ క్యాన్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు. వీరిపై వన్టౌన్ పోలీస్స్టేషన్లో నాలుగు, టూటౌన్ పోలీస్స్టేషన్లో ఒకటి, ఆలూరు పోలీస్స్టేషన్లో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయన్నారు. కేసును త్వరితగతిన చేధించిన పోలీసులను డీఎస్పీ అభినందించారు.