
పంచాయతీలా.. పరిషత్లా!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : హైకోర్టు ఆదేశాలతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తప్పనిసరైంది. ప్రభుత్వం ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి.. తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని భావించింది. కానీ.. పంచాయతీ ఎన్నికలను మూడు నెలల్లో పూర్తి చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. గ్రామ పంచాయతీ పాలక వర్గాలు పూర్తయి ఏడాదిన్నర అవుతుండగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పూర్తయి సంవత్సరం దాటింది. ఇప్పుడు ఈ రెండింటిలో ఏ ఎన్నికలు ముందు నిర్వహిస్తారనేది చర్చనీయంశంగా మారింది. మరోవైపు బీసీ రిజర్వేషన్ల అంశం కోర్టులోనే ఉంది. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అమలు చేసేలా జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధమవుతోంది. దీనిపై రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
కోర్టును ఆశ్రయించిన మాజీ సర్పంచ్లు
పంచాయతీల్లో పాలక వర్గాల గడువు పూర్తయి ఏడాదిన్నర కావస్తోంది. దీంతో పంచాయతీల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడం లేదని, ఎన్నికలు నిర్వహించే వరకు పాత సర్పంచ్లను కొనసాగించాలంటూ నల్లగొండ జిల్లా నుంచి ఇద్దరు మాజీ సర్పంచ్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసుపై వాదనలు విన్న హైకోర్టు సెప్టెంబర్ 30వ తేదీలోగా ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
ఎన్నికలకు సిద్ధంగా యంత్రాంగం
గతంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పడంతో జిల్లా యంత్రాంగం గ్రామ పంచాయతీల్లో వార్డుల వారిగా ఓటర్ల జాబితా సిద్ధం చేసింది. దాంతో పాటు పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులు లేకుండా నిర్వహించనున్నందున ఇప్పటికే బ్యాలెట్ పేపర్లను ముద్రించి నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని షెడ్లలో భద్రపరిచారు. పోలింగ్ కోసం ఏపీ నుంచి తెప్పించిన బ్యాలెట్ బాక్సులకు మరమ్మతు చేయించి సిద్ధం చేసి పెట్టారు. ఎన్నికల షెడ్యూల్ జారీ అయిన వెంటనే సిబ్బందికి శిక్షణ ఇస్తే సరిపోనుంది.
ముందుగా ఏ ఎన్నికలు?
ఫ మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశం
ఫ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం తర్జనభర్జన
ఫ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న జిల్లా యంత్రాంగం కసరత్తు
ఫ ఇంకా తేలని బీసీ రిజర్వేషన్ల అంశం
ఫ ఎన్నికలపై రెండుమూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం
కోర్టులోనే బీసీ రిజర్వేషన్ల అంశం
స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ 42 శాతం అమలు చేయాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కోర్టు పరిధిలో ఈ సమస్య ఉన్నందున అది తేలిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలనేది వారి వాదన. అయితే విషయం కోర్టులో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుని ఎన్నికలు పోతుందో అనేది వేచి చూడాల్సిందే. బీసీ రిజర్వేషన్ విషయంలో తీర్పు రాకపోతే కాంగ్రెస్ పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేసైనా ఎన్నికలకు పోవాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతోంది. మొదటిసారిగా నాలుగెకరాలకు పైబడి భూమి కలిగిన రైతులకు కూడా రైతుభరోసాను జమ చేసింది. దీన్ని అనుకూలంగా మార్చుకొని ఎన్నికల్లో గెలవాలని అధికార పార్టీ ఆలోచనల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
అధికారులకు శిక్షణ కూడా పూర్తి
పార్లమెంట్ ఎన్నికల తరువాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారన్న సంకేతాలు రావడంతో జిల్లాలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసి పెట్టారు. ఎన్నికలు పార్టీ గుర్తుల ఆధారంగా నిర్వహించనున్నందున బ్యాలెట్ పేపర్లు తెచ్చి ఇప్పటికే ఎస్పీ కార్యాలయంలో భద్రపరిచారు. పీఓ, ఏపీఓలకు శిక్షణ కూడా ఇచ్చారు. షెడ్యూల్ వస్తే మాత్రం ఓపీఓలకు కూడా డివిజన్ల వారీగా శిక్షణనివ్వడంతో పాటు నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత బ్యాలెట్ పేపర్లను ముద్రించనున్నారు.