నల్లగొండ : రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గురువారం నల్లగొండకు రానున్నారు. హైదరాబాద్ నుంచి బయల్దేరి నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయానికి ఉదయం 10 గంట లకు చేరుకుంటారు. నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ బయల్దేరి వెళతారు.
దరఖాస్తుకు నేడు చివరి గడువు
నల్లగొండ టౌన్ : వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని కాంట్రాక్టు పద్ధతిన పీడియాట్రీషియన్(1), మెడికల్ ఆఫీసర్(4) పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 26 సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పీడియాట్రిషన్ పోస్టుకు ఎండీ పీడియాట్రిషన్, మెడికల్ ఆఫీసర్ ఎంబీబీఎస్ అర్హత కలిగి ఉండాలలని.. 27న ఉదయం 10 గంటలకు కలెక్టరేట్లో ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తామని తెలిపారు.
ఇంటి నిర్మాణంలో నిబంధనలు పాటించాలి
త్రిపురారం : ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలని హౌసింగ్ పీడీ రాజ్కుమార్ సూచించారు. బుధవారం త్రిపురారం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. మండల వ్యాప్తంగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్లపై ఆరా తీశారు. ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విజయకుమారి, ఇన్చార్జి ఎంపీఓ కోడిరెక్క రాజేంద్రకుమార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
దేవరకొండ : యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని దేవరకొండ ఏఎస్పీ మౌనిక కోరారు. డ్రగ్స్ వ్యతిరేక అవగాహన వారోత్సవాల్లో భాగంగా బుధవారం దేవరకొండ మండల పరిధిలోని మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన సదస్సులో ఆమె మాట్లాడారు. యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితాలు నాశనమవుతాయన్నారు. విద్యార్ధులు ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తూ చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. అనంతరం వివిధ చట్టాలపై విద్యార్థులకు ఆమె అవగాహన కల్పించారు. సమావేశంలో సీఐ నర్సింహులు, ఎస్ఐ నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు.
30వ తేదీ వరకు ఆసరా పింఛన్ల పంపిణీ
నల్లగొండ : ఆసరా పింఛన్లను ఈ నెల 30వ తేదీ వరకు పంపిణీ చేయనున్నట్లు డీఆర్డీఓ శేఖర్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసరా పింఛన్లను ఆయా పోస్టాపీస్లలో పొందాలని సూచించారు. పింఛనుదారులు మధ్య దళారీలను నమ్మవద్దని పేర్కొన్నారు.
ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారిగా శ్రీనివాస్
నల్లగొండ టూటౌన్: ఎంజీ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్–1 ప్రోగ్రాం అధికారిగా అధ్యాపకుడు డి. శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈమేరకు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ మద్దిలేటి బుధవారం శ్రీనివాస్కు నియామక పత్రం అందజేశారు.